సేవకు సెలవ్‌!

12 May, 2018 08:32 IST|Sakshi

ఈఎస్‌ఐ సేవలకు స్విమ్స్‌ నిరాకరణ

రూ.9 కోట్లు బకాయి చెల్లించలేదనే నిర్ణయం

పది రోజులుగా కొత్త కేసుతీసుకోని వైనం

విజయవాడకు రెఫర్‌ చేస్తున్న ఈఎస్‌ఐ

అవస్థలు పడుతున్న కార్మికులు

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

స్విమ్స్‌ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. ఈఎస్‌ఐ ఆస్పత్రి రెఫరల్‌ సేవలను నిర్దాక్షిణ్యంగా ఆపేసింది. ఏడాదిగా రూ.9 కోట్ల బకాయి చెల్లించలేదన్న సాకుతో కార్మికుల సేవకు నిరాకరిస్తోంది. పది రోజులుగా టై అప్‌ లెటర్లు మంజూరు చేయకుండా కార్మికులను ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. విధిలేని పరిస్థితిలో కొందరు కార్మికులు విజయవాడ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

తిరుపతి (అలిపిరి): కార్మిక రాజ్య బీమా సంస్థ ద్వారా స్విమ్స్‌లో వైద్య సేవలు పొందుతున్న రోగులకు కష్టాలు తప్పేట్లు లేవు. ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త కేసులు తీసుకోవడానికి స్విమ్స్‌ నిరారించిం ది. ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ స్విమ్స్‌కురూ.9 కోట్లు బకాయి చెల్లించకపోవడంతో స్విమ్స్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈఎస్‌ఐ కార్డులున్న కార్మికులు, ఉద్యోగులు వైద్య సేవలు పొందడానికి తంటాలు పడాల్సి వస్తోంది. బిల్లుల చెల్లింపులో కార్మిక రాజ్య బీమా సంస్థ జాప్యం చేస్తోందని, ఆడిటింగ్‌ సమయంలో లోటు బడ్జెట్‌ను చూపించడం కష్టతరంగా మారడం వల్ల కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్విమ్స్‌ అధికారులు చెబుతున్నారు.

విజయవాడకు రెఫర్‌
స్విమ్స్‌ రెఫరల్‌ కేసును తీసుకోకపోవడంతో తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రి అధికారులు చేసేది లేక విజయవాడలోని ఆస్పత్రులకు పంపుతున్నారు. ఈఎస్‌ఐ పరిధిలో తిరుపతిలో శ్రీరమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నా అందులో పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు అందుబాటులో లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో రోగులను విజయవాడ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు.

20 ఏళ్లలోరూ.300 కోట్లు చెల్లింపు..
గడిచిన 20 ఏళ్లలో ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ స్విమ్స్‌కు రూ.300 కోట్లు చెల్లిం చింది. బకాయిలు సకాలంలో చెల్లించినా.. కొంతకాలంగా ఈఎస్‌ఐ కార్పొరేషన్‌లో దస్త్రాల కదలికలో తీవ్ర జాప్యం చోటుచేసుకోంది. స్విమ్స్‌కు బకాయి చెల్లింపుల్లో ఆలస్యమవుతోంది. బకాయి ని సాకుగా చూపి స్విమ్స్‌ యాజమాన్యం కార్మికులకు వైద్యం నిరాకరించడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈఎస్‌ఐ కార్డులున్న ఉద్యోగులకు స్విమ్స్‌లో వైద్య సేవలు అందేలా తక్షణం చర్యలు తీసుకోవాల్సింది.

టై అప్‌ లెటర్‌మంజూరుకు నిరాకరణ
ఈఎస్‌ఐ ఆస్పత్రి రెఫర్‌ చేసిన కేసులకు స్విమ్స్‌లో అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కనీసం టై అప్‌ లెటర్లూ మంజూరు చేయడం లేదు. రోగి వివరాలతో కూడి న టై అప్‌ లెటర్‌ను ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు పంపుతుంది. అప్రూవల్‌ వచ్చిన తర్వాత ఈఎస్‌ఐ ఆస్పత్రి రెఫరల్‌ చేస్తుంది. కార్పొరేషన్‌లో బకాయి మం జూరులో తీవ్రజాప్యం చోటు చేసుకోవడంతో ఈఎస్‌ఐ కార్డులున్న ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.

>
మరిన్ని వార్తలు