ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో మరో కీలక పరిణామం.. డీఆర్‌ఐ కొరడా

5 Dec, 2023 20:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెరాసాఫ్ట్‌ కేసులో డీఆర్‌ఐ కొరడా ఝుళిపించింది. ఫైబర్‌ నెట్‌ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ చర్యలు తీసుకుంది. ఫైబర్‌ నెట్‌ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్‌లేన్‌ టెక్నాలజీస్‌కు రూ.34 కోట్ల పెనాల్టీ విధించింది.

కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి అమ్మకం దారు చెల్లించాల్సి ఉంది. GST నిబంధనలను ఫాస్ట్‌లైన్‌ టెక్నాలజీస్‌ తుంగలో తొక్కింది. ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించారు. ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఉండగా, ఫాస్ట్‌లేన్‌ టెక్నాలజీస్‌ వెనక ఉన్నది టెరాసాఫ్ట్‌ కంపెనీగా గుర్తించారు. ఏపీ ఫైబర్‌నెట్‌ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే కాగా, విచారణలో ఫాస్ట్‌లేన్‌ మాజీ ఎండీ విప్లవ్‌కుమార్‌ పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్నారు. నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకరించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్‌ని(చంద్రబాబు సన్నిహితుడు) గుర్తించారు. టెరాసాఫ్ట్‌ ఎండీ తుమ్మల గోపిచంద్‌ విజ్ఞప్తి మేరకే పాస్ట్‌లేన్‌ను ఏర్పాటు చేసినట్టు విప్లవ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఇంగ్రామ్‌ ఆశ్రయించింది. ఫాస్ట్‌లేన్‌ దివాళా తీసినట్టు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు ఇంగ్రామ్‌ తెలిపింది.

సెప్టెంబర్‌ 2020 నుంచి ఫాస్ట్‌లేన్‌ కార్యకలపాలు నిలిపివేసింది. ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్‌లేన్‌ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసులో వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్‌కు ముందస్తు బెయిల్‌ రాగా, ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరిస్కరించింది. సుప్రీంకోర్టులో డిసెంబర్‌ 12న చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణకు రానుంది.

ఇదీ చదవండి: స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం

>
మరిన్ని వార్తలు