గ్రూప్‌–1 మెయిన్స్‌.. ట్యాబ్‌లో ప్రశ్నపత్రం

21 Mar, 2020 04:25 IST|Sakshi

యూట్యూబ్‌లో మార్గదర్శకాలు  

7 నుంచి నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌–1 మెయిన్స్‌లో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ట్యాబ్‌ ఆధారిత పరీక్ష మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో యూట్యూబ్‌లోనూ పొందుపరిచింది. గ్రూప్‌–1 పరీక్షలను ఏప్రిల్‌ 7 నుంచి 19వ తేదీవరకు ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల్లో ట్యాబ్‌లు అందచేసి అందులోనే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ప్రింటింగ్, పంపిణీతో పనిలేకుండా సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రం ట్యాబ్‌లో ఉంటుంది. కాగా కరోనా వైరస్‌ విస్తరిస్తున్న దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు కమిషన్‌కు విన్నవిస్తున్నారు.

ఇవీ మార్గదర్శకాలు...
అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు
అడ్మిట్‌కార్డులు, ఇతర గుర్తింపుకార్డులు తేవాలి. నిషేధిత వస్తువులు తీసుకురాకూడదు. 
పరీక్ష గదుల్లో ప్రతి సీటు వద్ద అభ్యర్థులవారీగా ట్యాబ్లెట్‌ డివైస్‌లను డెస్కులపై సిద్ధంగా ఉంచుతారు.
ట్యాబ్‌ కుడివైపు ఉన్న స్విచ్‌ ద్వారా డివైస్‌ను ఆన్‌చేయాలి
ట్యాబ్‌లో ‘స్టార్ట్‌ ఎగ్జామ్‌’ క్లిక్‌ చేయడం ద్వారా పరీక్షను ప్రారంభించాలి
ముందుగా సబ్జెక్టు పేరు క్లిక్‌ చేస్తే పాస్‌వర్డ్‌ అడుగుతుంది.
పరీక్షకు 5 నిమిషాల ముందు ఇన్విజిలేటర్‌ అభ్యర్థులకు ఇచ్చే పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తే ఆ సబ్జెక్టు ప్రశ్నపత్రం ట్యాబ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీన్ని జూమ్‌ చేసి చూసుకోవచ్చు.
అభ్యర్థులు పరీక్ష రాశాక డివైస్‌ను స్విచాఫ్‌ చేసి డెస్కుపైనే ఉంచి బయటకు వెళ్లాలి.
డివైస్‌ను ఇన్విజిలేటర్‌ దగ్గరకు తీసుకువెళ్లి ఇవ్వకూడదు.

మరిన్ని వార్తలు