రీఫిల్లింగ్ వ్యాపారం కాసుల వర్షం ..

10 Sep, 2014 00:09 IST|Sakshi

యథేచ్ఛగా నల్ల బజారుకు తరలిపోతోంది. కళ్లెదుటే అక్రమాలు జరుగుతున్నా అధికార గణం గుడ్లప్పగించి చూడడాన్ని వ్యాపారులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ.1200 వరకు ఆర్జిస్తున్న అక్రమార్కులు హోటళ్లకు సరఫరా చేయడం, వాహనాలకు రీఫిల్లింగ్ చేస్తూ తమ గ్యాస్ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తున్నారు.
 
సత్తెనపల్లి : జిల్లాలో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ వ్యాపారం కాసుల వర్షం కురి పిస్తోంది. రీఫిల్లింగ్ వ్యాపారులు కిలో గ్యాస్‌ను రూ.100లు చొప్పున విక్రయిస్తున్నారు. 14.2 కిలోల గృహ సిలిండర్‌పై రూ.1600 వరకూ వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధర కంటే రూ.1150లు అదనంగా సంపాదిస్తున్నారు.
 
* ఇది కాకుండా మరో విధానంలో కూడా సంపాదిస్తున్నారు. మూడు వంటగ్యాస్ సిలిండర్లు కలిపి రెండు వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్నారు. మూడు సిలిండర్ల ధర రూ.1,350 కాగా, ఒక్కో వాణిజ్య సిలిండరు 19 కిలోల వంతున రెండు సిలిండర్లకు రూ. 3,800 వసూలు చేస్తున్నారు. అంటే అదనంగా మిగిలిన రూ 2,450 జేబులో వేసుకుంటున్నారు.
* వినియోగదారుడికి నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు రాయితీపై ఇస్తున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులకు ఏజెన్సీలు సకాలం లో పంపిణీ చేయకపోవడంతో వారికి అవస్థలు తప్పడం లేదు. దీంతో రీఫిల్లింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
* ఈ కేంద్రాలకు గృహాల నుంచే ఎక్కువ సిలిండర్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. డబుల్ సిలిండర్ కలిగిన గృహ వినియోగదారుల నుంచి ఒక్కో సిలిండర్‌ను రూ. 700 నుంచి రూ. 800ల వరకు రీఫిల్లింగ్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
* హోటళ్ల నిర్వాహకులు కూడా రూ.800ల చొప్పున గృహ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
 
ఐదు కిలలో సిలిండర్‌కు అనుమతి ఎక్కడ ?
జిల్లాలో ఏ గ్యాస్ కంపెనీ వారు కూడా ఐదు కిలోల వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించడం లేదు. జిల్లాలో వాటికి అనుమతి లేదు. అయితే లైట్లు, వంట కోసం ఐదు కిలోల సిలిండర్లను దుకాణాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇవన్నీ రీఫిల్లింగ్ కేంద్రాల నుంచి వస్తున్న సిలిండర్లగా అర్థమవుతోంది.
 
*ఒక గ్యాస్ సిలిండర్(14.2 కిలోలు)తో మూ డు ఐదు కిలోల సిలిండర్లు నింపుతున్నారు. దీంతో అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు.
 ప్రమాదకరమని తెలిసినా ...
*రీఫిల్లింగ్ విధానంలో పైపు ద్వారా ఒక సిలిండర్ నుంచి మరో దానికి గ్యాస్ నింపుతుంటారు. కార్లకైతే విద్యుత్ మోటార్ ద్వారా ఎక్కిస్తుంటారు. నివాస ప్రాంతాల నడుమ ఇలాంటి ప్రక్రియ ప్రమా దకరమని తెలిసినా లాభాలే లక్ష్యంగా అక్రమాలకు ఒడిగడుతున్నారు.
*జిల్లాలో ఎక్కువగా పిడుగురాళ్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల, రేపల్లె, పొన్నూరు వంటి పట్టణాల్లో ఈ తంతు సాగుతోంది.
*పధానంగా సత్తెనపల్లిలోని అచ్చంపేట రోడ్డు శివాలయ సమీపం లో  రీఫిల్లింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ బహిరంగంగానే రీఫిల్లింగ్ చేస్తుంటారు.
* ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రీఫిల్లింగ్ కేంద్రాలు, హోటళ్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి వంట గ్యాస్ దుర్వినియోగం కాకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు