సర్వశిక్ష అభియాన్‌లో అడ్డగోలు దోపిడీ

16 Jun, 2019 04:11 IST|Sakshi

రూ.4.66 కోట్లు స్వాహా 

టీడీపీ ఎంపీ అండదండలతో నిధుల గోల్‌మాల్‌ 

సర్కారీ స్కూళ్ల లైబ్రరీలకు పుస్తకాల పంపిణీలో అక్రమాలు 

అవినీతిపై సర్కారు ఉక్కుపాదం 

రాష్ట్రంలో ఐఏఎస్‌ కేడర్‌ అధికారికి ఏసీబీ తొలి నోటీసులు 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేసిన పుస్తకాల కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. దాదాపు రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నిధులను మింగేసిన గోల్‌మాల్‌ భాగోతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడితో పాటు ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ  కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి జి.శ్రీనివాస్‌కు అవినీతి నిరోధక శాఖ శుక్రవారం నోటీసులు జారీ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్‌వరల్డ్‌ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండున్నరేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందజేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తామని పేర్కొంది. ఎస్‌ఎస్‌ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్‌ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ జి.శ్రీనివాస్‌ నిర్ణయించారు. ఎస్‌ఎస్‌ఏ అధికారులు, డ్రీమ్‌వరల్డ్‌ కంపెనీతో కుమ్మక్కు కావడంతో..ముందుగా చెప్పిన రేట్లకు బదులు పుస్తకాల ధరను భారీగా పెంచేశారు.   

సీఎం రమేష్‌ ప్రవేశంతో ‘డబుల్‌’ దందా! 
డ్రీమ్‌వరల్డ్‌ తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్, ఆ సంస్థ కుమ్మక్కై ఈ ధరను అమాంతం రూ.13,489కి పెంచేశారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పుస్తకాల కోసం డ్రీమ్‌వరల్డ్‌కు ఆగమేఘాల మీద ఆర్డర్లు ఇచ్చారు. డిస్కౌంట్‌ను కూడా 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. భారీగా కమిషన్ల కోసం రేట్లను అమాంతం పెంచేశారు. డ్రీమ్‌ వరల్డ్‌ సంస్థకు రాష్ట్ర కార్యాలయం నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా.. నిబంధనలను తుంగలో తొక్కి జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు.  

ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలిన అక్రమాలు.. 
ఎస్‌ఎస్‌ఏలో నిధుల గోల్‌మాల్‌పై తనకు అందిన ఫిర్యాదుల ఫైలును పరిశీలించిన ముఖ్యకార్యదర్శి పుస్తకాల రేట్లు అమాంతం పెరిగిపోవడాన్ని గుర్తించారు. డ్రీమ్‌వరల్డ్‌ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్‌లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడం ముఖ్యకార్యదర్శి దృష్టికి వచ్చింది. ముందుగా ఇచ్చిన ఆఫర్‌ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.13,489కి  పెంచేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957  చెల్లింపులు చేశారు.  

అసలది పబ్లిషింగ్‌ సంస్థే కాదు.. 
విచిత్రమేమంటే డ్రీమ్‌వరల్డ్‌ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్‌ సంస్థే కాదని.. కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది. ఇదిలా ఉండగా..ఈ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ రంగంలోకి దిగి రికార్డులను స్వాధీనం చేసుకుంది. వాస్తవాలు తేటతెల్లంగా తెలుస్తున్నా సీఎం రమేష్‌ సహా టీడీపీ నేతల ఒత్తిడితో గత ప్రభుత్వ హయాంలో కేసు ముందుకు సాగలేదు. తాజాగా ప్రభుత్వం అవినీతిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏసీబీ ఎస్పీడీకి నోటీసులు జారీ చేసింది.  

అక్రమాలకు సాక్ష్యాలివిగో.. 
ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇండియా’ పుస్తకం ధర రూ.1,495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. 

మరిన్ని వార్తలు