30న నిర్మాతల మండలి ఎన్నికలు

16 Jun, 2019 04:06 IST|Sakshi
వైవీఎస్‌ చౌదరి, రామసత్యనారాయణ, సి.కల్యాణ్, శ్రీనివాసరావు ప్రసన్నకుమార్, మోహన్‌ వడ్లపట్ల

ప్రతి రెండేళ్లకోసారి నిర్మాతలమండలి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఈసారి జరగాల్సిన ఎన్నికలు చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు నిర్మాతల మండలి ఎన్నికలు జూన్‌ 30న జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్‌ కలిసి ‘మన కౌన్సిల్‌– మన ప్యానెల్‌’ అనే నినాదంతో ముందుకు వచ్చారు. సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘నిర్మాతల మండలి నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబడింది. నిర్మాతలందరం ఒక గ్రూప్‌గా ఏర్పడి నిర్మాతల మండలి బలంగా ఉండాలని పి.రామ్మోహన్‌రావు, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాసరావు లాంటి పెద్దలందరూ ముందుకొచ్చారు’’ అన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నిజానికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా అర్హులకు తగ్గ పదవులిచ్చి నిర్మాతల మండలి స్ట్రాంగ్‌గా ఉండాలన్నదే మా కోరిక. కానీ సమయాభావం వల్ల సభ్యులందరూ అందుబాటులో లేని కారణంగా ఎన్నికలు జరపక తప్పటం లేదు’’ అన్నారు. టి. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా మిగిలిన సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి అర్హులైన, ఆసక్తి ఉన్న సభ్యులకి పదవులిస్తాం’’ అన్నారు.  ఈ ఎన్నికల్లో ‘మన ప్యానెల్‌’,‘గిల్డ్‌ప్యానెల్‌’ పోటీ పడనున్నాయి. ఈ కార్యక్రమంలో వైవీయస్‌ చౌదరి, నిర్మాతలు మోహన్‌ వడ్లపట్ల, రామసత్యనారాయణ, అశోక్‌ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు