పిల్లలతో సహా మొదటి భార్య గెంటివేత

28 Jan, 2019 08:52 IST|Sakshi
భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతున్న మొదటి భార్య సుజాత

టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం

బిడ్డలతో భర్త ఇంటి ముందు నిరసన

వైఎస్‌ఆర్‌ జిల్లా, రైల్వేకోడూరు : పట్టణంలోని లూథరన్‌ చర్చి ప్రాంగణంలో నివాసం ఉంటున్న తెలుగుదేశం నాయకుడు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కూని చంద్రయ్య కుమారుడు సునీల్‌ మొదట వెంకటరెడ్డిపల్లె అరుంధతీవాడకు చెందిన సుజాతను ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి హాసిని, దీక్షిత్‌ అనే పిల్లలు కలిగారు. అనంతరం సునీల్‌ మరో అమ్మాయి రెడ్డమ్మను మొదటి భార్యను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఇద్దరు బిడ్డలు పుట్టాక.. మొదటి భార్యను నిర్లక్ష్యం చేశాడు.

అంతేకాక తండ్రి టీడీపీ నాయకుడు కావడంతో పైరవీలు చేసి మొదటి భార్యను మరో ఇంట్లో పెట్టి ఆమెను పట్టించుకోలేదు. దీంతో ఆదివారం రాత్రి మొదటి భార్య సుజాత భర్త ఇంటి ముందు బిడ్డలతో సహా నిరసన తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఆరు నెలలుగా తన భర్త సునీల్‌ తనను తొలగించుకోవాలని వేధిస్తున్నాడని ఆధారాలు కూడా లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. రెండో భార్యతో కలిసి తనను చూసుకోవాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయింది. పెద్ద మనుషులతో చెప్పినా మామ, భర్త పట్టించుకోకుండా తనను గెంటి వేస్తున్నారని సుజాత ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలలుగా కూలి చేసుకుంటూ బిడ్డలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విలపించింది. బాధితురాలు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు