'ఓటమికి సిద్ధమైన టీడీపీ'

18 Aug, 2017 11:54 IST|Sakshi
'ఓటమికి సిద్ధమైన టీడీపీ'

నంద్యాల: అధికార టీడీపీ నంద్యాలలో ఓటమికి మానసికంగా సిద్ధమైందని వైఎస్సార్‌ సీపీ నేత పార్థసారధి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు తన కేబినెట్‌లో ఒక్క ముస్లింకు కూడా స్థానం కల్పించలేదని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు చంద్రబాబు చేసిన అవమానాన్ని వారు మర్చిపోలేదన్నారు. కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించిన వారికే ఎమ్మెల్సీ, మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు.

చంద్రబాబు నిర్ణయాలపై టీడీపీ అభ్యర్థులే కినుక వహిస్తున్నారని తెలిపారు. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా అగణతొక్కడం చంద్రబాబు నైజమన్నారు. ఓటమి భయంతోనే నంద్యాల ప్రజలను హింసిస్తున్నారని, గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ నేతలపై బైండోవర్‌ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఊరు వదిలి వెళ్లకపోతే రౌడీషీట్‌ తెరుస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. వైఎస్సార్‌ సీపీకి సహకరించిన దళితుడు బాలస్వామి ఇంటిపై పోలీసులతో దాడి చేయించారని, లెక్కలు చూసినా రూ. లక్ష నగదు తీసుకెళ్లారని తెలిపారు. అలాగే హుస్సేన్‌ అనే వ్యక్తి ఇంటిపైనా దాడులు చేయించి లక్షన్నర రూపాయలు సీజ్‌ చేశారని వెల్లడించారు. జగన్‌ను ఓటేస్తానని ఓ అవ్వ చెప్పడంతో పెన్షన్‌ కట్‌ చేస్తామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని చెప్పారు.

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఉంటున్న ప్రాంతాల్లో వీధిదీపాలు వెలగకుండా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈవిధంగా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటర్లు భయపడాల్సిన పనిలేదనికి, అందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని పార్థసారధి భరోసాయిచ్చారు.