ప్రభుత్వాన్ని పేదలు తిట్టుకుంటున్నారు

28 Nov, 2017 03:43 IST|Sakshi

ఈపాస్‌ విధానాన్ని తప్పుపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు 

సాక్షి, అమరావతి: ఈపాస్‌ విధానాన్ని అధికార టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఈ విధానం వల్ల రాష్ట్రంలోని వేలాదిమంది పేదలకు సరిగా రేషన్‌ అందడం లేదన్నారు. దీంతో వారంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై వారు మాట్లాడారు. రేషన్‌ సరిగా అందనివారు ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో ఉన్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు.

రెండు మూడు నెలలు రేషన్‌ తీసుకోకపోతే కూడా కార్డులు తొలగిస్తున్నారని, ఇలాగైతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈపాస్‌తో ప్రభుత్వానికి రావాల్సినంత చెడ్డపేరు వచ్చిందన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ.. వేలిముద్రలు సరిపోలని వారు 37 వేల మంది ఉన్నట్టు తేలిందని, వారికి కూడా రేషన్‌ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో వైద్యం పరిస్థితి దారుణంగా ఉందని పలువురు సభ్యులు మండిపడ్డారు.  అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో మంత్రులు అవాస్తవాలు చెబుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. ప్రభుత్వం దేవుళ్ల మధ్య కూడా విబేధాలు సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములు టాంపరింగ్‌కు గురయ్యాయని పలువురు ఆరోపించారు.

మరిన్ని వార్తలు