గుజరాత్‌ బరిలోకి మేవానీ

28 Nov, 2017 03:45 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని వాద్గాం(ఎస్సీ) స్థానం నుంచి ఎన్నికల పోటీకి దిగుతున్నానని దళిత నేత జిగ్నేష్‌ మేవానీ ప్రకటించారు. కాంగ్రెస్‌ పరోక్ష మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా మేవానీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా మద్దతు తెలిపింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ కోసం సోమవారం 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ తుది జాబితాను విడుదల చేయగా.. మేవానీకి మద్దతుగా వాద్గాంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు.

నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లను నిరాకరించిన ఆ పార్టీ.. ఓబీసీ నేత అల్పేశ్‌ ఠాకూర్‌కు రాధన్‌పూర్‌ నియోజకవర్గాన్ని కేటాయించింది. రెండు స్థానాల్ని జేడీయూ ఎమ్మెల్యే ఛోటుభాయ్‌ వసావా నేతృత్వంలోని భారతీయ ట్రైబల్‌ పార్టీకి వదిలిపెట్టింది. భారతీయ ట్రైబల్‌ పార్టీ మొత్తం ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆదివారం 76 మందితో కాంగ్రెస్‌ పార్టీ రెండో దశ ఎన్నికల కోసం తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు