కన్నీటి దిగుబడి

2 Sep, 2015 04:34 IST|Sakshi
కన్నీటి దిగుబడి

200 ఎకరాల్లో పత్తిపంట తొలగింపు
కన్నీరు పెట్టిన రైతులు
రూ.15 లక్షల పెట్టుబడి నష్టం

 
 గుత్ : ఖరీఫ్‌లో పత్తి సాగుచేసిన రైతుకు కన్నీటి ధారలే దిగుబడులు అయ్యాయి. వరుణుడిపై భారంతో అరకొర వర్షాలకు విత్తనం వేసి ఎదురు చూసిన రైతును వరుణుడు కరుణించలేదు. మధ్యలో వర్షం పడితే మొలచిన మొక్కలకు తోడు మధ్య మధ్యలో విత్తనం పెడితే  పెట్టుబడులు అయినా దక్కుతాయని ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో చేసేది లేక పత్తిమొక్కలను ట్రాక్టర్లతో పాచేస్తూ కన్నీటిని దిగమింగుకుంటున్నారు.

 ముఖ్యంగా గుత్తి మండలంలోని మామూడూరు గ్రామంలో సుమారు రెండు వందల మంది ఎనిమిది వందల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు. రెండు నెలలైనా కనీసం పూత కూడా రాలేదు. దీంతో పంటను తొలగించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. రైతులు మహేశ్వరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కమలాకర్, కేశవరెడ్డి, సాంబశివారెడ్డి, రామచంద్రారెడ్డి, రమణ, చియానందరెడ్డి తదితరులు ఒక్క సోమవారం రోజే సుమారు 200 ఎకరాల్లో పత్తిపంటను తొలగించారు.

ఈ సందర్భంగా ఆ రైతులు మాట్లాడుతూ ఇంతటి ఘోరమైన, దారుణమైన పరిస్థితులు తామెప్పుడూ చూడలేదన్నారు. 200 ఎకరాల్లో సాగు చేయడానికి సుమారు రూ.15 లక్షల వరకు వెచ్చించారు. అదే విధంగా మాముడూరు, ధ ర్మాపురం గ్రామాల్లో వేరుశగన పంట కూడా పూర్తిగా ఎండిపోయింది. రెండు రోజుల్లో పంటను తొలగించనున్నట్లు రైతులు చెప్పారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వెంకటరాముడు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఈసారి వర్షం పాతం చాలా తక్కువగా నమోదు అయిందన్నారు. దీంతో రైతులు సాగు చేసిన వేరుశగన, పత్తి, కంది, కొర్ర, పెసర, ఆముదం పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయన్నారు.

మరిన్ని వార్తలు