మేం మంచి దోస్తులం

20 Dec, 2017 13:03 IST|Sakshi

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు 

కోడెల ఇంటికి వెళ్ళిన మధుసూదనాచారి

సాక్షి, గుంటూరు: ఉమ్మడి రాష్ట్రంలో తామిద‍్దరం కలిసి పనిచేశాం. గతంలో ఒకే పార్టీలో పనిచేసిన మా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. మేము మంచి దోస్తులం అంటూ ఏపీ అసెంబ్లీ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు.  తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ బుధవారం ఉదయం గుంటూరులో ఏపీ స్పీకర్ కోడెల ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా కోడెల కుటుంబ సభ్యుల నుంచి వారికి సాదర స్వాగతం లభించింది. తిరుమలతోపాటు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా మధుసూదనాచారి కుటుంబ సభ్యులకు దర్శన భాగ్యం కల్పించాలని సంబంధిత దేవాలయాల అధికారులను స్పీకర్ కోడెల ఆదేశించారు.

 సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి కలిశారు. ఈ సందర‍్భంగా ఇరువురు స్పీకర్లు విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోయినా రెండు రాష్టాలు సఖ్యతతో పనిచేస్తున్నాయన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఉందన్నారు. శాసనసభ వ్యవహారాలలో ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నామని వారు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు