అక్రమాల ఊడలు

14 Aug, 2015 00:59 IST|Sakshi
అక్రమాల ఊడలు

బీపీఎస్ ముసుగులో యథేచ్ఛగా నిర్మాణాలు
టౌన్‌ప్లానింగ్‌లో దళారీ దందా
మాట వినని టీపీఎస్‌ను మార్చేందుకు కుట్ర
ఉన్నతాధికారులు దృష్టిసారించాలి మరి..

 
బీపీఎస్ ముసుగులో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. అధికార పార్టీ కార్పొరేటర్లు కొందరు అవినీతి మేడలు కట్టేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ముఖ్య అధికారిని గుప్పెట్లో పెట్టుకున్న ఓ దళారీ ఈ కథంతా నడిపిస్తున్నాడు. తన మాట వినని అధికారులను అంతర్గత బదిలీలు చేయించే స్థాయికి సదరు దళారీ ఎదగడం ఇప్పుడు కార్పొరేషన్‌లో హాట్ టాపిక్‌గా  మారింది.
 
విజయవాడ సెంట్రల్ : బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. నిబంధనల ప్రకారం 1985 జనవరి నుంచి 2014 డిసెంబర్ మధ్యకాలంలో నిర్మాణమైన భవనాలకు మాత్రమే ప్రభుత్వం బీపీఎస్‌కు అనుమతిచ్చింది. దీనిని సాకుగా తీసుకుని         అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు అక్రమ కట్టడాలను      ప్రోత్సహిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం    సాగుతోంది. గవర్నర్‌పేట మ్యూజియం రోడ్డులో టౌన్‌ప్లానింగ్ అనుమతులు లేకుండా మూడో అంతస్తు నిర్మాణం సాగుతోంది. విద్యుల్లత సిటీప్లానర్‌గా పనిచేసిన కాలంలో ఈ భవనంలో రెండో అంతస్తుకే అనుమతించలేదు. అన ధికారికంగా నిర్మించేందుకు ప్రయత్నించగా, రెండుసార్లు ఆమె కూలగొట్టారు. ఆమె బదిలీ అయిన మూడు నెలలకే రెండో అంతస్తు వెలిసింది. తాజాగా మూడో అంతస్తు నిర్మాణంలో ఉంది. దీనికి సంబంధించి భారీ డీల్ జరిగినట్లు సమాచారం.

టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి హస్తం ఇందులో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తపేట అహ్మద్‌వీధిలో రెండో అంతస్తు నిర్మాణం జరుగుతోంది. అలాగే, బందరురోడ్డులోని ఒక ప్రముఖ హోటల్‌పై, మొగల్రాజపురంలోని మోడరన్ మార్కెట్ సమీపంలో అపార్ట్‌మెంట్ అనధికారిక కట్టడాలకు అనుమతిచ్చారు. వన్‌టౌన్, భవానీపురం, గవర్నర్‌పేట, సింగ్‌నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా నిర్మిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, బ్రోకర్లే డీల్స్ కుదురుస్తున్నారనేది బహిరంగ రహస్యం. బీపీఎస్‌కు ప్రభుత్వం అనుమతిచ్చాక నగరంలో సుమారు రెండువేల పైచిలుకు అక్రమ కట్టడాలు వెలిసినట్లు భోగట్టా. వీటిద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 చక్కబెడుతున్నారు
 టౌన్‌ప్లానింగ్‌ను బ్రోకర్లు రాజ్యమేలుతుండటంపై మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్య అధికారిని బదిలీ చేయాల్సిందిగా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్‌ను రెండు నెలల కిందటే కోరారు. డీటీసీపీ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. సాయిబాబా అనే అధికారి ఇక్కడకు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
 ఎలాగూ బదిలీ అయిపోతున్నాం కాబట్టి చక్కబెట్టేద్దాం.. అనే ‘ప్లానింగ్ ’లో అధికారి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు భోగట్టా. టౌన్‌ప్లానింగ్‌పై అందుతున్న ఫిర్యాదులపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు తగని మొహమాటం ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే అక్రమాల లోగుట్టు బట్టబయలవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
 దళారీ దందా
 టౌన్‌ప్లానింగ్‌లో ఆ దళారీ రూటే సెప‘రేటు’. ముఖ్య అధికారిని గుప్పెట్లో పెట్టుకుని కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లోనే ఆయన పనంతా. పై అధికారి పేరు చెప్పి కిందిస్థాయి ఉద్యోగుల్ని బెదరేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సర్కిల్-3లో ఓ భారీడీల్‌కు సంబంధించి సంతకం చేయాల్సిందిగా టీపీఎస్‌ను కోరగా, ఆయన నిరాకరించారు. దీంతో సదరు దళారీ వేరే సర్కిల్ టీ పీఎస్‌తో సంతకం చేయించి ముఖ్య అధికారితో ఆమోదముద్ర వేయించినట్టు భోగట్టా. ఈ విషయమై ఇద్దరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగిందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. సీన్‌కట్ చేస్తే.. సర్కిల్-3లో తాము చెప్పిన పనులు చేయడం లేదనే నెపంతో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణను బదిలీ చేయించే కుట్ర సాగుతోంది. దీనికి సంబంధించి ఫైల్‌ను ముఖ్య అధికారి సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌కు స్క్రీన్‌ప్లే దళారీ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో టీపీఎస్ మార్పునకు సంబంధించిన ఫైల్ కమిషనర్ టేబుల్‌పైకి చేరనున్నట్లు సమాచారం.
 
 

మరిన్ని వార్తలు