డబ్బుకోసం అడ్డదారులు

8 Sep, 2014 03:00 IST|Sakshi
డబ్బుకోసం అడ్డదారులు

- మీడియా ముసుగులో బ్లాక్ మెయిల్
- ఫాదర్ బాల బ్లాక్‌మెయిల్ కేసులో నిందితుల్లో నలుగురు మీడియూ వ్యక్తులే
సాక్షి, ఏలూరు :  ‘మన చుట్టూ నేరగాళ్లు తిష్టవేసుకుని కూర్చుంటారు.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాళ్లపని చేసుకుపోతారు.. కానీ ఎంత తెలివైన నేరస్తుడైనా ఏదొక చిన్న క్లూ విడిచిపెడతాడు.. చివరికి జైల్లో ఊచలు లెక్కపెడతాడు.. చట్టం నుంచి తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు..’ ఈ మాటలు పలు టీవీ న్యూస్ చానళ్లలో చాలా సార్లు విన్నాం.

ఈ మాటలు వినగానే దాదాపు అందరి కళ్లల్లోనూ మెదిలే యాంకర్ ఒక్కరే. అతనే యండ్రపాటి హర్షవర్దన్. పలు టీవీ చానళ్లలో పనిచేసి, ఫ్రీలాన్స్ యాంకర్‌గానే కాకుండా సినీ నటుడిగానూ ప్రేక్షకులకు పరిచయమున్న వ్యక్తి హర్షవర్దన్. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని కొందరిలో కలిసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి తన ప్రోగ్రాం చివరిలో చెప్పినట్టే చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
 
పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి.బాలను రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో ప్రథమ ముద్దాయి యండ్రపాటి హర్షవర్దన్‌తోపాటు నల్లజర్లలో సత్యసాక్షి ఛానల్ నడుపుతున్న లూక్‌బాబు, హేలాపురి సాయంకాల దినపత్రికలో ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు విలేకరులుగా పనిచేస్తున్న బోడ విజయకుమార్, దిరిసిపాముల విజయరత్నం, ఏలూరులోని కార్ల యాక్సెసరీస్ షోరూమ్‌కు చెందిన వీరంకి చిరంజీవిని అరెస్ట్ చేశారు.

ఐదుగురు నిందితులను ఏలూరు డీఎస్పీ పి.సత్తిబాబు ఆదివారం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వద్ద మీడియా ముందు ప్రవేశపెట్టారు. నేరానికి ఉపయోగించిన లూక్‌బాబుకు చెందిన ఎపీ 37 బిఏ 3303 నంబరు టాటా సఫారీ, విజయకుమార్‌కు చెందిన ఏపీ 37 బివై 5373 నంబరు ఐ10 మోడల్ కార్లను, 5 సెల్‌ఫోన్లు, రూ.37,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. పల్లేష్ అనే పరో నిందితుడు పరారీలో ఉన్నాడని, ఈ ముఠాలో తెరవెనుక మరికొందరు సభ్యులు ఉంటారనే అనుమాలున్నాయని డీఎస్పీ చెప్పారు.

విచారణలో మరికొన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు. నిందితులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67ఏ, ఐపీసీ సెక్షన్లు 448, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదుచేశామని  తెలిపారు. నిందితులను పోలీస్ కష్టడీకి అప్పగించాల్సిందిగా కోర్టును కోరతామన్నారు. వీరిపై రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు.
 
అంతా ఒక్కటై
హైదరాబాద్‌లో స్థిరపడిన యండ్రపాటి హర్షవర్దన్ స్వగ్రామం జిల్లాలోని భీమడోలు మండలం తండ్రగుంట. దెందులూరులోనూ అతనికి బంధువులు ఉన్నారు. అతనికి ఇక్కడ స్థిరాస్తులు కూడా ఉన్నాయి. హర్షవర్దన్ కుటుంబం 30ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడింది. ప్రస్తుతం అతను పలు టెలివిజన్ ఛానళ్లలో ఫ్రీలాన్స్ యాంకర్‌గా పని చేస్తూనే, కొన్ని సీరియళ్లు, సినిమాల్లోనూ నటిస్తున్నాడు. సమాచార ప్రసార శాఖలో సౌండ్ అండ్ డ్రామా విభాగంలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా స్థానం సంపాదించాడు.

నల్లజర్లలో ‘సత్యసాక్షి’ ఛానల్‌లో యాంకరింగ్ చేసేందుకు వచ్చేవాడు. అలా ఫాదర్ లూక్‌బాబుతో పరిచయం ఏర్పడింది. విజయకుమార్, చిరంజీవి పదేళ్లుగా స్నేహితులు. వీరికి బ్లాక్‌మెరుుల్ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న విజయరత్నంతో స్నేహం ఏర్పడింది. ఈ ఐదుగురు రెండు నెలల క్రితం కలిశారు. అప్పటి నుంచి సులభంగా డబ్బులు సంపాదించడానికి మార్గాలను అన్వేషించారు.

బ్లాక్‌మెయిల్ ఇలా..
ఓ ముఠాగా ఏర్పడిన నిందితులు సెరుుంట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి.బాలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజాలని పథకం రచించారు. వారం క్రితం రంగంలోకి దిగారు. ఫాదర్ బాలకు హర్షవర్దన్ ఫోన్‌చేసి ‘మీకు ఇబ్బంది కలిగించే కొన్ని వీడియో సీడీలు నా వద్ద ఉన్నారుు. రూ.10 కోట్లు ఇవ్వకపోతే వాటితో పాటు వ్యతిరేక కథనాలు టీవీల్లో ప్రసారం చేస్తామని బెదిరించాడు. కనీసం రూ.5 కోట్లు అయినా ఇవ్వాలని, ముందుగా రూ.కోటి చెల్లించాలని బేరమాడారు. శుక్రవారం నేరుగా ఫాదర్ బాలను కలిసి చర్చించారు. శనివారం డబ్బులు అందజేయాలన్నారు. అడ్వాన్స్ తీసుకోవడానికి హర్షవర్దన్ విజయవాడలో మకాం వేశాడు. మరో ఇద్దరు ఫాదర్ బాల వద్దకు వచ్చారు.
 
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
ఫాదర్ బాల ఎస్పీ రఘురామిరెడ్డిని ఆశ్రయించారు. ఎస్పీ వెంటనే డీఎస్పీకి ఆదేశాలిచ్చారు. దీంతో త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను డీఎస్పీ రంగంలోకి దింపారు. డబ్బులు ఇస్తాం రమ్మని పిలవడంతో భీమడోలు జంక్షన్‌కు వచ్చిన లూక్‌బాబు, చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు విజయవాడలో ఉన్న హర్షవర్దన్, విజయరత్నం, విజయకుమార్‌లను అక్కడి టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెంజి సర్కిల్ వద్ద కారులో వెంబడించి పట్టుకున్నారు. వీరందరినీ డీఎస్పీ సత్తిబాబు  ఏలూరు తీసుకువచ్చారు.
 
నిందితులకు టీడీపీ నాయకుల అండ!
బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్ట్ అయిన హర్షవర్దన్ ముఠాకు టీడీపీ నేతలు అండగా నిలిచారు. సీసీఎస్ నుంచి నిందితులను తరలిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ఓ టీడీపీ నాయకుడితో పాటు మరికొందరు వారికి ధైర్యం చెప్పారు. మీరెవరని విలేకరులు ప్రశ్నించగా తాము రాష్ట్ర హోమ్ మంత్రి అనుచరులమని, నిందితులకు బెయిల్ మంజూరు చేయించడానికి వచ్చామని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు