అందరూ సుఖసంతోషాలతో జీవించాలి

9 Apr, 2016 00:59 IST|Sakshi
అందరూ సుఖసంతోషాలతో జీవించాలి

మంత్రి రావెల కిషోర్‌బాబు ఆకాంక్ష
►  ఘనంగా ఉగాది ఉత్సవాలు

 
గుంటూరు ఈస్ట్ :  సమాజంలో అంతరాలు తగ్గి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను మంత్రి కిషోర్‌బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కుల, మతాలకు చెందిన పేద లందరూ సుఖ సంతోషాలతో వారి పండుగలు జరుపుకునేలా రాష్ర్ట ప్రభుత్వం చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక అందచేస్తున్నట్లు తెలిపారు. సమసమాజ స్థాపనలో భాగంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేందుకు ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.

జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ దుర్ముఖి నామ సంవత్సరంలో గుంటూరు ప్రజలందరూ పాడిపంటలతో , సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ప్రపంచ ఖ్యాతి, మన్ననలు పొందేలా మనందరం కోరుకుంటున్న నూతన అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి కావాలన్నారు. శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఎ.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చే శారు. సంయుక్త కలెక్టర్ సి.హెచ్.శ్రీధర్ మాట్లాడుతూ  నూతన రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతు కుటుంబాలకు మంచి జరగాలని ఆశించారు.

అమరావతి నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తొలుత వేద పండితుడు అవధాని అంబపూడి సత్యనారాయణ శాస్త్రి పంచాగ శ్రవణం నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ కళా రంగాలలో సేవలందించిన కళాకారులను, కవులను సత్కరించారు. పలువురు కవులు ఉగాది కవితా గానం చేసి ఆకట్టుకున్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్, ఆర్డీవో భాస్కరనాయుడు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, డీఆర్‌వో నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు