నయవంచకులపై గర్జన

28 Dec, 2018 07:14 IST|Sakshi
వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే కంబాల జోగులు

ఢిల్లీలో వైఎస్సార్‌ సీపీ ధర్నా

ప్రత్యేక హోదా సాధనకు డిమాండ్‌

వంచనపై గర్జన పేరిట నిరసన

చంద్రబాబు జిమ్మిక్కులపై ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ :నిస్సిగ్గుగా నయవంచన పర్వం సాగించారు. నాలుగేళ్లపాటు నమ్మక ద్రోహం చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ప్రత్యేక హోదా అంశానికి పాతరేశారు. హోదా మాటెత్తితే శివాలెత్తారు. ఇప్పుడు పోలవరం అంటూ.. స్టీల్‌ప్లాంట్‌ అంటూ జిమ్మిక్కులు ప్రారంభించారు. ఎన్నికల శంకుస్థాపనలతో మళ్లీ మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును వైఎస్సార్‌ సీపీ ఎండగట్టింది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో దేశ రాజధానిలో గురువారం ‘వంచనపై గర్జన’ పేరిట నిరసన తెలిపింది. ఎముకలు కొరికే చలిలో వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులు రోజంతా ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ముమ్మాటికి ఇవ్వాల్సిందేనని ముక్తకంఠంతో కోరారు.

వంచనపై గర్జనలో ఎమ్మెల్యే జోగులు
రాజాం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని, విభజన చట్టంలో హామీలును అమలుచేయాలని నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద గురువారం నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమంలో పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేస్తున్న మోసానికి నిరసనగా ఈ కార్యక్రమం జరిగిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని ఒక్క వైఎస్సార్‌ సీపీయేనని ఆయన చెప్పారు. జగన్‌తోనే హోదా సాధ్యామన్నారు.

మరిన్ని వార్తలు