'మంత్రి చేతుల్లో పోలీసులు పావులుగా మారారు'

6 Feb, 2019 20:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసులను ప్రయోగించి వేధింపులకు పాల్పడుతున్నారని మైలవరం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మంత్రి దేవినేని ద్వారా  మైలవరం సీఐ పోస్టింగ్ తెచ్చుకున్న సంగతి అందరికి తెలుసన్నారు. ఆ కృతజ్ఞతతో ప్రతిచోటా వైఎస్సార్‌సీపీ నేతలపై సదరు సీఐ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు.

మంత్రి దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామనే కక్షతో సదరు సీఐ తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు.పోలీసులకు కవర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ తప్పుడు కేసులు పెట్టారని నిప్పులు చెరిగారు. దమ్ముంటే పోలీసులు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తాము ఏ పోలీసు అధికారిని డబ్బు కవర్లతో ప్రలోభ పెట్టలేదన్నారు. మంత్రి దేవినేని ఉమ చేతుల్లో పోలీసులు పావులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక దేవినేని తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మైలవరం సీఐని తమపై ప్రయోగించారన్నారు. ఎల్లో మీడియాలో తమపై అసత్య ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు