లంచం తీసుకుంటూ పట్టబడిన వీఆర్‌ఓ

10 Nov, 2018 13:03 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని చూపిస్తున్న ఏసీబీ డీఎస్పీ నాగరాజు, పట్టుబడిన ఇన్‌చార్జి వీఆర్‌ఓ శ్రీనివాసులు

ఈ–పాసుబుక్కు కోసం రూ.9వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం

వైఎస్‌ఆర్‌ జిల్లా, పెనగలూరు : ఈ–పాసుపుస్తకం కోసం రూ.9 వేలు లంచం తీసుకుంటూ వైఎస్సార్‌ జిల్లా సింగనమల ఇన్‌చార్జి వీఆర్‌ఓ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. శుక్రవారం ఉదయం 10:30గంటలకు కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో దాడులుచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సింగనమల వీఆర్‌ఓ నరసింహులు సెలవుపై వెళ్లడంతో ఓబిలి వీఆర్‌ఓ శ్రీనివాసులును ఇన్‌చార్జిగా నియమించారు. గ్రామానికి చెందిన కోడూరు నరేష్‌ ఐదుఎకరాలకు సంబంధించి ఈ–పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం రూ.10వేలు లంచం అడిగినట్లు నరేష్‌ తెలిపారు. కువైట్‌ నుంచి ఇండియాకు వచ్చి ఈ–పాసుపుస్తకం కావాలంటూ దరఖాస్తు చేసుకుని శ్రీనివాసులు ఇంటివద్దకు శుక్రవారం రాత్రి వెళ్లారు.

నేను కువైట్‌కు త్వరగా వెళ్లాలి. ఈ–పాసుపుస్తకం కావాలని వీఆర్‌ఓ, నరేష్‌ల మధ్య రూ.9వేలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందం మాటలు కూడా నరేష్‌ రికార్డుచేసి ఏసీబీకి అందించినట్లు సమాచారం. కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పెనగలూరుకు రావడంతో నరేష్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న వీఆర్‌ఓకు రూ.9వేలు లంచం ఇచ్చారు. కార్యాలయంపక్కనే ఉన్న ఏసీబీ అధికారులు శ్రీనివాసులు వద్దకు వెళ్లి రూ.9వేలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులు వద్ద ఉన్న రూ.9వేలు నగదు తాము ఇచ్చిందేనని ఏసీబీ అధికారులు వేలిముద్రలు సేకరించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీనివాసులును తమ వెంటే తీసుకుని కర్నూలుకు వెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు