పరిశ్రమల భూకేటాయింపులు మరింత సరళం

11 Nov, 2023 06:20 IST|Sakshi

లీజు విధానం బదులు సేల్‌డీడ్‌ విధానంలో కేటాయింపు

మొత్తం సొమ్ము చెల్లించగానే అమ్మకం ఒప్పందం

డీపీఆర్‌ ప్రకారం నిబంధనలన్నీ పాటించిన 

తర్వాత తుది అమ్మకపు పత్రాలు

ఉత్తర్వులు జారీచేసిన పరిశ్రమల శాఖ

సాక్షి, అమరావతి : సులభతర వాణిజ్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు భూ కేటాయింపులను మరింత సరళతరం చేసింది. 2023–27 పారిశ్రామిక విధానం కింద.. పరిశ్రమలు లీజు విధానంలో కాకుండా నేరుగా భూములు కొనుగోలు చేసేలా పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు 33/99 ఏళ్లకు లీజు విధానంలో ఈ కేటాయింపులు చేస్తుండగా నిధుల సమీకరణకు లీజు ఒప్పందాలు అడ్డంకిగా మారుతున్నాయంటూ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మన్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌. యువరాజ్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా పొందుపరిచారు. తాజా ఉత్తర్వుల ప్రకారం..

  • సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసే వారు భూమి విలువను మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్షణం వారితో ఏపీఐసీసీ లేదా పరిశ్రమల శాఖ భూమి కొనుగోలు ఒప్పందం చేసుకుంటుంది. 
  • ప్రాజెక్టు ఏర్పాటుచేసేటప్పుడు ప్రభుత్వంతో చేసు­కున్న ఒప్పందాలన్నీ నిర్ధిష్ట కాలపరిమితి­లోగా చేసుకుంటే వెంటనే ఆ భూమిపై పూర్తి హక్కులను కేటాయిస్తూ తుది సేల్‌ డీడ్‌ను అందజేస్తారు. 
  • అదే మధ్య, పెద్ద, భారీ పరిశ్రమల విషయానికొస్తే.. దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టినా మొత్తం భూమి విలువ ఒకేసారి చెల్లిస్తే సేల్‌ అగ్రిమెంట్‌ చేస్తారు.
  • అలాగే, డీపీఆర్‌ ప్రకారం దశల వారీగా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలుచేసిన తర్వాత తుది అమ్మకం డీడ్‌ను అందజేస్తారు. 
  • ఒకవేళ పరిశ్రమలు పెట్టేవారు దశల వారీగా సేల్‌డీడ్‌ను కోరుకుంటే ఆ ఫేజ్‌లో చేరుకోవాల్సిన లక్ష్యాలు చేరుకుంటే ఆ మేరకు ఆ భూమికి సేల్‌డీడ్‌ చేస్తారు. 
  • ఒకవేళ రెవెన్యూ శాఖ భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా పరిశ్రమల శాఖ ఆమోదించిన డీపీఆర్‌ నిబంధనలు చేరుకున్న తర్వాతనే భూమిని కేటాయిస్తారు. 
  • ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 
మరిన్ని వార్తలు