మాఫీపై స్పష్టత ఇవ్వండి

1 Oct, 2014 02:32 IST|Sakshi
మాఫీపై స్పష్టత ఇవ్వండి

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరిన బ్యాంకర్లు
 
మాఫీకి బ్యాంకులు సహకరించాలనే విజ్ఞప్తితో సరిపెట్టిన ఆర్థిక మంత్రి
{పభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఉద్దేశంతోనే రైతులు రుణాలు
చెల్లించలేదన్న బ్యాంకర్లు  వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలపైనా స్పష్టతకు విజ్ఞప్తి
బ్యాంకుల క్రెడిట్ రేటింగ్   బాగా పడిపోరుుందని ఆందోళన
మాఫీ ప్రక్రియ విధివిధానాలపై నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం
కేవలం నివేదిక సమర్పణకే పరిమితమైన ఎస్‌ఎల్‌బీసీ భేటీ

 ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఉద్దేశంతోనే రైతులు రుణాలు చెల్లించలేదన్న బ్యాంకర్లు
 
హైదరాబాద్: రైతుల వ్యవసాయ రుణాల మాఫీపై.. మంగళవారం నాటి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ప్రకటించడంతో రైతులు రుణాలు తిరిగి చెల్లించడానికి ముందుకు రావడం లేదని, తద్వారా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రుణ మాఫీతో పాటు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలపై స్పష్టత ఇవ్వాలని బ్యాంకర్లు కోరారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కేవలం రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలన్న విజ్ఞప్తితో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సరిపెట్టారు. 186వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఆంధ్రా బ్యాంక్  కేంద్ర కార్యాలయం పట్టాభి భవన్‌లో జరిగింది. సమావేశానికి ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.కె.కల్రా అధ్యక్షత వహించారు. ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ సి.దొరస్వామి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర ఆర్థిక శాఖ డెరైక్టర్ ఎన్.శ్రీనివాసరావు, ఆర్బీఐ రీజినల్ డెరైక్టర్ కె.ఆర్.దాస్, నాబార్డ్ సీజీఎం జిజి మెమ్మన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వల్ల బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ పడిపోయిందనే విషయాన్ని ఆంధ్రా బ్యాంక్ ఈడీ కల్రా తన 10 నిమిషాల ప్రసంగంలో ఐదుసార్లు ప్రస్తావించారు.

రుణమాఫీకి సహకరించాలి: యనమల

రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి వీలుగా రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు సహకరించాలని ఆర్థిక మంత్రి కోరారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం బ్యాంకర్లతో చర్చించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. ఆ ప్రతిపాదనల ఆధారంగా రుణమాఫీ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినా ఇప్పటివరకు కేవలం 38 శాతమే రుణ వితరణ జరిగిందని, కనీసం రబీ సీజన్‌లో అయినా మెరుగ్గా రుణాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌లో పంట రుణాలు లక్ష్యం రూ.25,888 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.5,593 కోట్లు మాత్రమే ఇచ్చారు.

ఏపీ పరిస్థితి తారుమారరుు్యంది: కల్రా

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద లక్ష్యానికి మించి ఖాతాలు తెరవడంలో బ్యాంకులు విజయం సాధించాయని ఆంధ్రా బ్యాంక్ ఈడీ కల్రా చెప్పారు. మరోవైపు రుణాల మంజూరులో అధికభాగంగా ఉండే వ్యవసాయ రుణాల వితరణలో బ్యాంకులు విఫలమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఆశతో రైతులు రుణాలు తిరిగి చెల్లించడం/రెన్యువల్ చేసుకోవడానికి విముఖత చూపించడం వల్లే బ్యాంకుల వ్యాపార పరిమాణం తగ్గిపోయిందని చెప్పారు. ఈ ఏడాది వ్యవసాయానికి రూ. 56,019 కోట్ల రుణం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.7,263 కోట్లు(12.97 శాతం) మాత్రమే ఇచ్చామని తెలిపారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని అధిగమించే రాష్ట్రంగా ఏపీకి పేరుందని, కానీ ఈ ఏడాది పరిస్థితులు తారుమారయ్యాయని, ఫలితంగా రైతులతో పాటు బ్యాంకులకూ నష్టం కలిగిందన్నారు. వ్యవసాయ రుణాలు నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)గా మారడంతో బ్యాంకు క్షేత్రస్థాయి సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతినడంతో పాటు బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాల సమగ్ర సమాచారాన్ని అక్టోబర్ 10కి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు కింద కేంద్రం ఇటీవలే ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో తిరిగే 30 రైళ్లపై రాతల ద్వారా ప్రచారం చేయనున్నట్లు నాబార్డు సీజీఎం తెలిపారు.

వడ్డీ లేని రుణాలపై విధానమేంటో చెప్పండి

వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ దొరస్వామి కోరారు. ఖరీఫ్ 2013-14కు సంబంధించి పంట రుణాలకు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ అమలు జరిగిందని, అరుుతే రబీకి సంబంధించి ఎలాం టి నిర్ణయం వెలువరించలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించకుంటే రైతులతో పాటు ప్రభుత్వంపైనా భారం పడుతుందన్నారు. అయితే దీనిపై మంత్రు లు యనమల, ప్రత్తిపాటి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు