పచ్చదళంలో వర్గపోరు

18 Apr, 2015 02:47 IST|Sakshi

సాక్షిప్రతినిధి, అనంతపురం:  మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య వర్గపోరు మరింతగా రాజుకుంటోంది. ఇటీవల ప్రభుత్వాసుపత్రిలో పరిటాల శ్రీరాంకు జరిగిన సన్మానసభ ఇప్పటికే వారి మధ్య ఉన్న వివాదానికి ఆజ్యం పోసింది. తన నియోజకవర్గంలో తనకు తెలీకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో శ్రీరాం అనంతపురానికి కాబోయే ఎమ్మెల్యే అనేలా ప్రచారాన్ని సృష్టించడం ఎమ్మెల్యేకు మింగుడుపడటం లేదు. దీంతో ఎలాగైనా శ్రీరాంపై కేసు నమోదు చేయించాలని ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇటు ఎమ్మెల్యే, అటు మంత్రి తనయుని మధ్య అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
 జనవరిలో పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా వెంకటాపురంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తాన్ని అనంతపురం జనరల్ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంకుకు ఇచ్చారు. దాదాపు 5వేల యూనిట్లకుపైగా రక్తాన్ని ఇచ్చారనే కారణంతో ‘శాంతిసేన రక్తదాన సహకార బంధువు’ ఆధ్వర్యంలో పరిటాల శ్రీరాంకు అనంతపురం జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలో మార్చి 16న సన్మానం చేశారు.
 
  ఈ కార్యక్రమానికి బ్లడ్‌బ్యాంక్ ఇన్‌చార్జ్ డాక్టర్ శివకుమార్ హాజరయ్యారు. మేయర్ స్వరూపతో పాటు నగరానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సభలో మేయర్ స్వరూప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురానికి శ్రీరాం ఏదోఒక రోజు ఎమ్మెల్యే అవుతారని వ్యాఖ్యానించి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై ఉన్న వ్యతిరేకత ను బాహాటంగానే ప్రకటించారు. శ్రీరాం కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని యోచిస్తున్నారు. పెనుకొండస్థానంపై కన్నేసినా, బీకే పార్థసారథిని కాదని ఎమ్మెల్యే సీటు సంపాదించడం కష్టమని మంత్రి సునీత భావించారు. దీంతోనే అనంతపురం స్థానంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శ్రీరాంను ప్రమోట్ చేయడంలో భాగంగానే సన్మాన కార్యక్రమం నిర్వహించారనేది తెలుస్తోంది.
 
 శ్రీరాంపై కేసు నమోదు చేయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం
 పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో తన అసెంబ్లీ పరిధిలో తనకు ఆహ్వానం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో మేయర్ చేసిన వ్యాఖ్యలను చౌదరి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్ ఇన్‌చార్జ్ శివకుమార్‌ను పిలిచి సన్మానం ‘ఎందుకు చేశారు? ఆస్పత్రి ప్రాంగణంలో ఎలా అనుమతి ఇచ్చారు? రోడ్డు మొత్తం బ్లాక్ చేసి, గేట్లు మూసి, మార్చురీ వైపు గేట్లు తెరిచి రోగులను పంపించారు.
 
  మీ చర్యలతో రోగులు ఎంత ఇబ్బందిపడ్డారు?’ అని తీవ్రస్థాయిలో మండిపడినట్లు ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి ‘సభకు మీరు అనుమతి ఇచ్చారా?’ అని ఎమ్మెల్యే ప్రశ్నించగా, అనుమతి ఇచ్చారో లేదో? తనకు తెలీదని? విచారిస్తానని సూపరింటెండెంట్ చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని ఆసరగా చేసుకున్న ఎమ్మెల్యే అనుమతి లేకుండా సభ నిర్వహించారని లేఖ ఇవ్వాలని సూపరింటెండెంట్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్ లేఖ ఇస్తే అనుమతి లేకుండా సభ నిర్వహించి, రోగులకు అసౌకర్యం కల్పించారనే కారణంతో శ్రీరాంపై కేసు నమోదు చేయించేలా చౌదరి వ్యూహం రచిస్తున్నారు.
 సీఎంకు ఫిర్యాదు చేసేందుకు పరిటాల వర్గం సిద్ధం:
 ఎమ్మెల్యే చౌదరి తీరుపై శ్రీరాం కూడా అదేస్థాయిలో స్పందించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఏం మాట్లాడారో ఆస్పత్రి వర్గాల ద్వారా ఆరా తీసిన శ్రీరాం ఈ విషయాన్ని మంత్రి సునీత ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. పరిటాల రవి వర్ధంతి సందర్భంగా చేసిన రక్తదానం నేపథ్యంలో శ్రీరాంకు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సన్మానం చేశారని, దీన్ని కూడా చౌదరి రాజకీయం చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పరిటాల వర్గాలు చెబుతున్నాయి.
 
  ఇదే క్రమంలో మంత్రితో పాటు మేయర్ స్వరూప కూడా ఎమ్మెల్యేపై ఫిర్యాదుల చిట్టాను సీఎంకు అందజేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య తలెత్తిన విభేదాలతో టీడీపీ నగరపార్టీ కూడా రెండువర్గాలుగా చీలిపోయింది. అధికారం వచ్చిన తర్వాత సయోధ్యతో పార్టీని మరింత బలోపేతం చేసి, కార్యకర్తలకు అండగా నిలవాల్సిన నేతలు అనతికాలంలోనే విభేదాలతో పార్టీని బలహీనపరుస్తున్నారని పలువురు పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు