అనుమానం పెనుభూతమై..

11 Sep, 2014 01:20 IST|Sakshi
అనుమానం పెనుభూతమై..

లక్కవరపుకోట:భార్యకు వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానం దహించి వేయడంతో కట్టుకున్న భార్యను హత్య చేశాడో కసాయి భర్త. కలకాలం అండగా ఉంటాడని భావించి ఏడడుగులు నడిచి పెళ్లి చేసుకున్నభర్త..వరుసకు మరిది అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగట్టి  ప్రాణాలు తీశాడు. ఇందుకు సంబంధించి ఎస్‌కోట సీఐ లక్ష్మణరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కిత్తన్నపేట గ్రామానికి చెందిన గొలగాని ఎర్రునాయుడుకు కొత్తవలస మండలం నరపాం గ్రామానికి చెందిన ముత్యాలమ్మతో ఐదు సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొంతకాలం వారి  కాపురం సజావుగానే సాగింది. ఈ మధ్యకాలంలో వరుసకు మరిది అయిన వ్యక్తితో ముత్యాలమ్మ మాట్లాడడంతో భర్త  ఆమెకు వివాహేతర సంబంధం అంటగట్టి నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు గొడవపడేవారు. దీంతో మూడునెలలనుంచి ముత్యాలమ్మ కన్నవారింటి దగ్గర ఉంది. ఈనెల 8వతేదీన అత్తవారింటికి వచ్చింది.
 
 మరునాడు రాత్రి భార్తాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. రోజూలాగానే  పశువులకు నీళ్లు తాగించడానికని భార్య బుధవారం  వెళ్లడానికి చూసిన భర్త ఆమెను వెంబడించి చంపి ఉరివేశాడని సీఐ తెలిపారు. ముందుగా చంపేసి తరువాత ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుందని పోలీస్ స్టేషన్‌కు వచ్చి నమ్మించాలని చూశాడని, విచారణలో  మాత్రం వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. మృతురాలి తండ్రి కొయ్యాన అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్‌కోట సీఐ కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌కోట కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు