ఫేస్‌బుక్‌తో బుక్కయ్యాడు

8 Nov, 2014 01:43 IST|Sakshi
ఫేస్‌బుక్‌తో బుక్కయ్యాడు

యువతిపై మోజుతో నగరానికి చేరిన భీమవరం వాసి
పోలీసులమంటూ బెదిరించి బంగారం దోచుకున్న ముగ్గురు యువకులు
పోలీసుల అదుపులో ముగ్గురు

 
చిట్టినగర్  :  పోలీసులమంటూ ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని బెదిరించి ఏడు కాసులకు పైగా బంగారాన్ని దోచుకున్నారు. కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జక్కంపూడిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.  సేకరించిన వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మధు అనే యువకుడికి హైదరాబాద్‌లో ఉంటున్న  మజ్జి పద్మ(26) అనే యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఖమ్మం జిల్లాకు చెందిన పద్మకు  తల్లిదండ్రులు లేకపోవడంతో కొంత కాలం గా హైదరాబాద్‌లో ఉంటుంది. పద్మతో పాటు విజయవాడ కొత్తూరు తాడేపల్లికి చెందిన రాజశేఖర్ అనే యువకుడితో మధుకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఉండేది. పద్మ, మధుల మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో విజయవాడకు గురువారం వస్తున్నానని చెప్పిన పద్మను కలుసుకునేందుకు మధు గురువారం నగరానికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లిలోని మామిడి తోటకు వెళ్లారు. జక్కంపూడి, షాబాద్ గ్రామాలకు చెందిన  రాజేష్, మరో ఇద్దరు యువకులు తోటలోకి వచ్చి పోలీసులమంటూ హడావుడి చేశారు. వీరిలో ఒకరు తాను కొత్తపేట ఎస్సైనని బెదిరించాడు. ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నిం చాడు. దీంతో   మధు బెదిరిపోయాడు. అతడి చేతికి ఉన్న బ్రాస్‌లెట్‌తో పాటు మెడలోని గొలుసు, చేతి ఉంగరాలు మొత్తం ఏడు కాసుల బంగారాన్ని బలవంతంగా లాక్కున్నారు. మధు, పద్మ నగరానికి తిరిగివస్తూ మార్గమధ్యంలో ఎదురైన పోలీసులకు విషయం తెలిపారు. వారు వెంటనే రాజేష్‌తో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనలో  రాజశేఖర్‌ది కూడా కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకునేందుకు  పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లినట్లు తెలి సింది. ఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత నిందితులను అరెస్టు చూపే అవకాశాలున్నాయని స్టేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
 
వెలుగులోకి మరో కోణం...

అయితే ఈ కేసులో మరో కోణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఉంటున్న రాజశేఖర్, యువతితో కలిసి ఫోన్‌లో మాయమాటలు చెప్పి యువకులను మోసం చేసి బంగారం, డబ్బు గుంజుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. అదే రీతిలో గురువారం హైదరాబాద్ నుంచి నగరానికి యువతి బయలుదేరిన విషయాన్ని రాజశేఖర్ తన మిత్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి నకిలీ పోలీసుల రూపంలో బంగారం దోచుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్లు తెలిసింది. గతంలో ఇదే తరహాలో మరేమైనా ఘటనలకు పాల్పడ్డారా?   యువతి ఎంత మందిని మోసం చేసిందనే కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు