‘అన్నా.. భవన నిర్మాణ పనిలో ప్రమాదవశాత్తూ రెండు కాళ్లు విరిగిపోయాయి. నన్ను ఆదుకోండి’ అంటూ మేడికొండూరు గ్రామంలోని ఇందిరానగర్కు చెందిన కొటికల రాజేష్ జననేతను వేడుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మేడికొండూరు గ్రామానికి చేరుకున్న ప్రతిపక్ష నేత జగన్ను కలసి గోడు వెళ్లబోసుకున్నారు. రెండు నెలల కిందట భవన నిర్మాణ పనిలో ఉండగా భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ కిందికి పడటంతో రెండు కాళ్లూ విరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కదలలేని స్థితిలో ఉన్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కార్మికులకు వర్తింపజేసే బీమా కూడా అందలేదన్నారు. తన భార్య ఆస్తమాతో మృతి చెందిందని, కుమారుడు సైతం ఆస్తమాతో ఇబ్బంది పడుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. పనిచేయలేని తనను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.