వారి ఆవేదనతో చలించిపోయిన సీఎం జగన్‌

1 Oct, 2019 10:10 IST|Sakshi

సాక్షి, తిరుపతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి వస్తున్నారని తెలిసి.. తమ బాధ చెప్పుకుందామని.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చాందినీ, రజనీ అనే ఇద్దరు అమ్మాయిలు సోమవారం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. విమానాశ్రయం వెలుపల ఏర్పాటుచేసిన గ్యాలరీలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి.. తమ అన్నకు ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకున్నారు. ‘మా అన్న హరికృష్ణ తిరుపతి రవీంద్రభారతి స్కూల్‌లో 10వ తరగతి చవివేవాడు. 2015 నవంబర్‌ 21న స్కూల్‌ సిబ్బంది భవనం పైనుంచి కిందకు తోసేశారు. మూడేళ్లపాటు కోమాలో ఉన్నాడు.. చెన్నై ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేశారు. చికిత్స కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం కావాలి’.. అని చాందిని, రంజని సీఎంను అభ్యర్థించారు.  

వారి ఆవేదన విని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఓదార్చి.. హరికృష్ణ వైద్య ఖర్చుల కోసం 10 లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఆ పిల్లల చదువులకు మరో 5 లక్షల రూపాయలు కేటాయించాలని ఆదేశించారు. పుట్టెడు కష్టంతో వచ్చిన ఆ ఇద్దరు అక్కాచెలెళ్లను ఆదుకొని మరోసారి సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి తన పెద్ద మనస్సును చాటుకున్నారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేందుకు సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విమానాశ్రయం వెలుపల ఏర్పాటుచేసిన గ్యాలరీలో ఉన్న అర్జీదారుల సమస్యలను ఎంతో ఓర్పుగా ఆలకించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి.. గ్యాలరీలో ఉన్న అందరి వద్దకు వెళ్లి ఒక్కొక్కరి అర్జీని స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అర్జీలను జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తాకు అందించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో తమ సమస్యలపై సీఎం స్పందించిన తీరుకు వారంతా ముగ్థులయ్యారు.
చదవండి: సమస్యలు ఆలకిస్తూ.. భరోసా ఇస్తూ..

మరిన్ని వార్తలు