సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర అశేష జనసందోహం నడుమ చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 62వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నెన్నురు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు.
నన్నేరు, శెట్టివారిపల్లి క్రాస్, కట్టకింద వెంకటాపురం చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం వెంకటాపురం క్రాస్, చల్లావారిపల్లి మీదుగా సొరకాయలపాలెం క్రాస్, మతురుపల్లి, పులిగుంట్ల, కమ్మలపల్లి క్రాస్కు చేరుకుంటారు. అక్కడి నుంచి దేసురివారి కండ్రిగ, రావిళ్లవారిపల్లి మీదుగా పరకల్వ క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. దారిపొడవునా వైఎస్ జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రతిపక్ష నేత యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుండటం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 841.7 కిలోమీటర్లు నడిచారు.