మహిళలకు ఆసరా

12 Aug, 2019 10:07 IST|Sakshi

డ్వాక్రా సంఘాలకు రూ.1340 కోట్ల ప్రయోజనం

జిల్లాలో 46 వేల సంఘాలకు వైఎస్సార్‌ ఆసరా

ప్యూరిఫికేషన్‌ పనిలో అధికారులు

వచ్చే ఏడాది నుంచి చెల్లింపునకు సిద్ధం 

సాక్షి, కాకుళం పాతబస్టాండ్‌: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా స్వయం శక్తి సంఘాల రుణ మాఫీకి సిద్ధమయ్యారు. రుణం పొందిన ప్రతి సంఘంలోని ప్రతి సభ్యురాలికీ ప్రయోజనం చేకూరేలా వైఎస్సార్‌ ఆసరా పేరిట కార్యాచరణ రూపొందించారు. దీనిప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ నెల 11 నాటికి మహిళా సంఘాలకు ఉన్న బ్యాంకు రుణాలు తీర్చేం దుకు నడుం కట్టారు. ఈ సంఘాలు ఎన్నికల సమయం నాటికి బ్యాంకుల నుంచి పొందిన రుణ నిల్వలను వారి సంఘాల ఖాతాలో జమ చేయడానికి సీఎం మాట ఇచ్చారు. అందుకు గాను వచ్చే ఏడాది నుంచి నాలుగు విడతలుగా వారి రుణ మొత్తాన్ని ఆయా సంఘాల బ్యాంకుల్లో జమ చేయనున్నారు.

ఎన్నికల సమయం నాటికి జిల్లాలో 46,272 మహిళా సంఘాలు రూ.1340.74 కోట్ల రుణ భారం కలిగి ఉన్నాయి. వీరందరికీ వైఎస్సార్‌ ఆసరా ద్వారా మేలు జరగనుంది. అందుకు గాను ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులు, వారి పరిస్థితి, ఆర్ధిక లావాదేవీలు, రుణ వివరాలు తదితర అంశాలపై ప్యూరిఫికేషన్‌ మొదలు పెట్టారు. జిల్లాలో ఈ ప్రక్రియ 30 శాతం వరకు పూర్తయింది. ఈనెల 20 నాటికి ప్యూరిఫికేషన్‌ పూర్తి చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

మహిళలను మోసగించిన గత ప్రభుత్వం.. 
గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంఘాలను మోసం చేసింది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు మహిళ సంఘాల బ్యాంకుల రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ బ్యాంకులకు రుణ వాయిదాలు చెల్లించవద్దని చెప్పారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తరువాత మాటమార్చారు. రుణమాఫీ సాధ్యం కాదని, ప్రతి మహిళకు పది వేలు ఇస్తామని చెప్పారు. అది కూడా మూడు విడతల్లో ఇచ్చారు. అందులో ఎక్కువ మొత్తం జన్మభూమి కమిటీలకు మామూళ్ల రూపంలో చెల్లించడంతోనే సరిపోయింది. వాయిదాలు కట్టకపోవడంతో రుణభారంలో సంఘాలు కురుకుపోయాయి. దీంతో బ్యాంకు అధికారులు సంఘల పొదుపు మొత్తాలను రుణ ఖాతా లకు మళ్లించారు. దీంతో సంఘాలు చాలా వరకు దివాళా తీశాయి. మరికొన్ని సంఘాలు వివాదాలతో నిర్వీర్యంగా మారాయి.  

మరిన్ని వార్తలు