యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ జిల్లా ఎస్పీని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజాసంకల్పయాత్రకు అనుమతితో పాటు భద్రత కల్పించాలని వైఎస్ఆర్ సీపీ నేతలు బుధవారం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, తిప్పారెడ్డి, నారాయణస్వామి, డాక్టర్ సునీల్ కుమార్, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా పార్టీ నేతలు జంగలపల్లి శ్రీనివాసులు, బియ్యపు మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 26 నుంచి చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం కానుంది.
అనంతరం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... రాష్ట్రంలో దుశ్శాసన పాలన సాగుతోందన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలంటూ టీడీపీ నేతలకు ఇంత చిన్నచూపా అని రోజా సూటిగా ప్రశ్నించారు. మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు.