కలమట కుమారుడిని కఠినంగా శిక్షించాలి

15 Oct, 2019 09:56 IST|Sakshi
ఎస్పీ అమ్మిరెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి 

ఎస్పీని కోరిన పాతపట్నం   ఎమ్మెల్యే రెడ్డి శాంతి 

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమారుడు సాగర్‌ ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని, ఇటువంటి వారిపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డిని కోరారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఆయనను సోమవారం కలిసిన ఆమె.. వినతిపత్రం అందజేశారు. ఈనెల 9న కొత్తూరు మండలం మాతల గ్రామంలో సామాజిక భవనం వద్ద శ్రమదానం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, ప్రభుత్వం నియమించిన వలంటీర్లపై కలమట కుమారుడు తన అనుచరులతో కలిసి దాడికి దిగారని తెలిపారు.

అసభ్య పదజాలంతో దుర్బాషలాడుతూ కర్రలతో దాడి చేసి, గాయాలపాలు చేశారన్నారు. బాధితుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని, కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న ప్రధాన నిందితుడైన సాగర్‌ను ముమ్మరంగా గాలించి, పట్టుకోగా.. బెయిల్‌తో ఇంటికి చేరుకున్నారని పేర్కొన్నారు. సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఇటువంటి వారికి బెయిల్‌ నిరకరించడంతో పాటు కఠినంగా శిక్షించాలని ఆమె విన్నవించారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. ఘటనపై వివరాలు సేకరించి, బాధ్యులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. 

మరిన్ని వార్తలు