ఇకపై ఇసుక ఉచితమే..

9 Mar, 2019 11:00 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య   

ఎమ్మెల్యే పొదెం వీరయ్య

సాక్షి, భద్రాచలంటౌన్‌: పట్టణంలో ఇళ్లు నిర్మించుకునే వారు ఇక నుంచి ఇసుకను ఉచితంగా తెచ్చుకోవచ్చని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువైందని, ఇళ్లు నిర్మించుకునే వారు ట్రాక్టర్‌కూ రూ. 3వేల నుంచి 4వేల వరకు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఈ విషయంపై పట్టణ ప్రజలు తనను సంప్రదించడంతో ఈ విషయాన్ని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీతో చర్చించినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ పట్టణ వాసుల వరకు ఇసుకను తెచ్చుకొనే విధంగా హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు రెవిన్యూ శాఖలకు ఆదేశాలు త్వరలోనే జారీ చేయనున్నట్లు వివరించారు. భద్రాచలం పట్టణం దాటి ఇసుక రవాణా జరిగినట్లయితే పీడీ యాక్టు నమోదు చేయిస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మాజీ గ్రంథాలయం చైర్మన్‌ బోగాల శ్రీనివాసరెడ్డి, సరేళ్ల నరేష్, హనుమంతు, డేగల నాగేశ్వరరావు, దుద్దుకూరి సాయిబాబు, కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు