ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు

5 Sep, 2018 14:18 IST|Sakshi

న్యూఢిల్లీ: రాన్‌బాక్సీ కుటుంబ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. గత కొన్నినెలలుగా  సింగ్‌బ్రదర్స్‌ మధ్య నెలకొన్న అసంతృప్తి ఇపుడిక  కోర్టుకెక్కింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ ప్రమోటర్, సింగ్‌ బ్రదర్స్‌లో ఒకరైన శివిందర్ సింగ్, సోదరుడు మల్వీందర్‌పై పోరుకు సై అన్నాడు. సోదరుడు, మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్, స్థాపకుడు మల్వీందర్‌, రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోధ్వానీలను తమ వ్యాపార భాగస్వామిగా తప్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు శివిందర్ మూడు పేజీల ప్రకటనను విడుదల చేశారు.

తన అన్నయ్య మల్వీందర్‌, గోదాని సంయుక్తంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలతో తమ సంస్థల ప్రయోజనాలతోపాటు, వాటాదారుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. చాలాకాలంగా ఈ విషయం వ్యక్తిగతంగా తనను బాధిస్తున్నప్పటికీ కుటుంబగౌరవం, ప్రతిష్ట కోసం మౌన ప్రేక్షకుడిలాగా ఉండిపోయానన్నారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇకనుంచి తాను స్వత్రంత్రంగా వ్యాపారాన్ని కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రిలిగేర్, ఫోర్టిస్ పతనం, అక్రమాల నేపథ్యంలో కేసును దాఖలు చేసినట్టు తెలిపారు. అయితే ఈ పరిణామంపై స్పందించేందుకు మాల్వీందర్ సింగ్  నిరాకరించారు.

మరిన్ని వార్తలు