క్రెడిట్‌ కార్డులను తీసుకొస్తున్న టెక్‌ దిగ్గజం

12 May, 2018 11:55 IST|Sakshi

వాషింగ్టన్‌ : స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌  మార్కెట్‌లో తనదైన హవా సాగిస్తున్న టెక్‌ దిగ్గజం ఆపిల్‌ దృష్టి ఇప్పుడు క్రెడిట్‌ కార్డు వ్యాపారంపై పడింది. ఈ కంపెనీ ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ‘గోల్డ్ మ్యాన్ శాక్స్’తో కలిసి, క్రెడిట్‌ కార్డులను ఆఫర్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆపిల్‌ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టనున్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టు చేసింది. దీనికోసం ఇటీవలే గోల్డ్ మ్యాన్ శాక్స్ తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. 

మరింత ఆదాయం పొందే వ్యూహంలో భాగంగా ఆపిల్‌ క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. ఆపిల్‌ పే బ్రాండుతో ఈ కార్డులు మార్కెట్‌లోకి వస్తాయని రిపోర్టులు పేర్కొన్నాయి. ఆపిల్‌ పే అనేది ఈ టెక్నాలజీ దిగ్గజానికి చెందిన మొబైల్‌ పేమెంట్‌, డిజిటల్‌ వాలెట్‌ ప్లాట్‌ఫామ్‌. తన రెవెన్యూల్లో గాడ్జెట్లనే కాకుండా.. మిగతా వాటిని భాగస్వామ్యం చేయాలని ఆపిల్‌ భావిస్తోంది. బ్యాంకులు, టెక్‌ స్టార్టప్‌ల నుంచి ఇటీవల పేమెంట్స్‌ స్పేస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంటున్న సంగతి తెలిసిందే.  క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆపిల్ ఆదాయాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అధికార ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు. 

మరిన్ని వార్తలు