హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ అపర్ణ ఎంటర్ప్రైజెస్ అల్యూమినియం ఎక్స్టీరియర్స్ సొల్యూషన్స్ విభాగంలోకి ప్రవేశించింది. హాంగ్కాంగ్ సంస్థ క్రాఫ్ట్ హాల్డింగ్స్తో కలిసి అపర్ణ క్రాఫ్ట్ ఎక్స్టీరియర్స్ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేసింది. అపర్ణ క్రాఫ్ట్ బ్రాండ్లో అల్యూమినియం ఎక్స్టీరియర్స్ తయారీ, విక్రయం చేపడతామని అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఎండీ అశ్విన్ రెడ్డి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. జేవీలో తమ కంపెనీకి 74 శాతం వాటా ఉంటుందన్నారు.
బాచుపల్లి వద్ద రూ.30 కోట్లతో తయారీ కేంద్రం నెలకొల్పామని అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఈడీ అపర్ణ రెడ్డి వెల్లడించారు. జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ విభాగం ద్వారా తొలి ఏడాది రూ.100 కోట్ల ఆదాయం ఆశిస్తున్నారు. అపర్ణ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30% వృద్ధితో రూ.850 కోట్ల టర్నోవరు నమోదు చేయబోతోందన్నారు.