అవినీతి ఉచ్చులో మరో బ్యాంకరు

21 Jun, 2018 00:18 IST|Sakshi

డీఎస్‌కే గ్రూప్‌ రూ.3,000 కోట్ల ఎగవేత కేసు

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ, ఈడీ అరెస్ట్‌

అదుపులో మాజీ సీఎండీ కూడా  

పుణె: కార్పొరేట్‌ కంపెనీల రుణాల ఎగవేత కుంభకోణంలో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా డీఎస్‌ కులకర్ణి గ్రూప్‌ డిఫాల్ట్‌ కేసుకు సంబంధించి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీవోఎం) ఎండీ, సీఈవో రవీంద్ర మరాఠేతో పాటు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌కే గుప్తాను పుణెలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్ట్‌ చేసింది. బ్యాంకు మాజీ సీఎండీ సుశీల్‌ మునోత్‌ను కూడా అదుపులోకి తీసుకుంది.

డీఎస్‌కే గ్రూప్‌తో కుమ్మక్కైన బీవోఎం అధికారులు మోసపూరిత లావాదేవీల ద్వారా రుణాలిచ్చారని ఆరోపణలున్నాయి. బ్యాంకు సిబ్బంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రుణాల కింద మంజూరు చేసిన నిధులు దారి మళ్లాయని ఈవోడబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 3,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్‌ కుట్ర తదితర అభియోగాలపై ఈవోడబ్ల్యూ అరెస్ట్‌ చేసింది.  

సుమారు రూ.2,892 కోట్ల బ్యాంకు రుణాల నిధులను మళ్లించడం, 4,000 మంది పైచిలుకు ఇన్వెస్టర్లను రూ. 1,154 కోట్ల మేర మోసగించడం తదితర ఆరోపణలపై బిల్డరు డీఎస్‌ కులకర్ణి, ఆయన భార్య హేమంతి ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ప్రస్తుత, మాజీ అధికారులతో పాటు డీఎస్‌కే గ్రూప్‌కి చెందిన మరో ఇద్దరిని కూడా ఈవోడబ్ల్యూ అదుపులోకి తీసుకుంది.

ఇందులో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సునీల్‌ ఘట్‌పాండే, ఇంజనీరింగ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ నిత్యానంద్‌ దేశ్‌పాండే ఉన్నారు. ఇన్వెస్టర్లను మోసగించినందుకు కులకర్ణి, ఆయన భార్యతో పాటు డీఎస్‌కే గ్రూప్‌లోని ఇతర కీలక అధికారులకు చెందిన 124 ప్రాపర్టీలు, 276 బ్యాంకు ఖాతాలు, 46 వాహనాలు జప్తు చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు