భూషణ్‌ స్టీల్‌ మాకు రూ.900 కోట్లివ్వాలి

9 Mar, 2018 00:25 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్మాణరంగ దిగ్గజ కంపెనీ లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) భూషణ్‌ స్టీల్‌ నుంచి బకాయిల వసూలు కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించింది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న భూషణ్‌ స్టీల్‌ నుంచి తనకు రావాల్సిన బకాయిలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. క్యాపిటల్‌ గూడ్స్‌ను సరఫరా చేసినందుకు సంస్థ నుంచి తమకు రూ.900 కోట్లు రావాల్సి ఉందని ఎల్‌ అండ్‌ టీ న్యాయవాది ట్రిబ్యునల్‌ను కోరారు. తమను సెక్యూర్డ్‌ క్రెడిటర్‌గా గుర్తించాలని కోరారు. దీనిపై అభిప్రాయం తెలియజేయాలని దివాలా పరిష్కార నిపుణులను ట్రిబ్యునల్‌ ఆదేశించింది. భూషణ్‌ స్టీల్‌లో నియంత్రిత వాటా కొనుగోలుకు తాము అధిక బిడ్డర్‌గా నిలిచినట్టు టాటా స్టీల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం గమనార్హం.  

చైర్మన్‌ని ప్రశ్నించిన ఎస్‌ఎఫ్‌ఐవో: రూ.1,000 కోట్ల నిధుల స్వాహా ఆరోపణలకు సంబంధించి భూషణ్‌ స్టీల్‌ చైర్మన్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింఘాల్‌ని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) గురువారం ప్రశ్నించింది. ఎస్‌ఎఫ్‌ఐవో గతేడాది నుంచి కంపెనీలో నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ జరుపుతోంది. భూషణ్‌ స్టీల్‌ దాదాపు రూ. 44,000 కోట్ల మేర బ్యాంకులకు బాకీ పడింది. మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన 12 కంపెనీలపై దివాలా చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించిన సంస్థల్లో ఇది కూడా ఉంది.   

మరిన్ని వార్తలు