బ్లాక్‌స్టోన్‌ చేతికి ఇండియాబుల్స్‌ చెన్నై ప్రాపర్టీ

7 Jul, 2018 01:32 IST|Sakshi

డీల్‌ విలువ రూ.850 కోట్లు  

న్యూఢిల్లీ: ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ చెన్నైలోని ఆఫీస్‌ ప్రాపర్టీని అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించింది. వాణిజ్య ఆస్తుల విక్రయంలో భాగంగా చెన్నైలోని అంబత్తూర్‌లోని ఈ ప్రాపర్టీని విక్రయించినట్లు ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ తెలిపింది. ఈ  డీల్‌ విలువ రూ.850 కోట్లని, వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 కల్లా పూర్తవుతుందని  పేర్కొంది.

1.9 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌తో కూడిన చెన్నైలోని ఈ ‘వన్‌ ఇండియాబుల్స్‌ పార్క్‌’ దాదాపు పూర్తయిందని, వార్షికంగా రూ.85 కోట్ల అద్దె ఆదాయం లభిస్తుందని వివరించింది. ఈ కంపెనీ ఈ ఏడాది మార్చిలో ముంబైలోని రెండు ప్రధాన వాణిజ్య ఆస్తుల్లో 50 శాతం వాటాను ఇదే సంస్థలకు రూ.3,750 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్‌ సంస్థ నేరుగా, జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ఎంబసీ గ్రూప్‌తో కలసి భారత్‌లోని ప్రధాన నగరాల్లో మొత్తం 6 కోట్ల చదరపుటడుగుల వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు