జీతాల కోసం వెయ్యికోట్ల రూపాయల అప్పు

5 Jan, 2019 13:15 IST|Sakshi

ఆర్థిక ఒత్తిడిలో ప్రభుత్వ రంగ రక్షణసంస్థ హెచ్‌ఏఎల్‌

ఉద్యోగుల మూడు నెలల జీతాల కోసం వెయ్యి కోట్లు అప్పు

మార్చి నాటికి మరింత భారం

ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కోంటోంది. దీర్ఘకాలంనుంచి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నసంస్థ తాజాగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం,  తదితర అవసరాల కోసం  వెయ్యకోట్లు రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది.  20వేలకు పైగా ఉన్న ఉద్యోగులకు  మూడు నెలల జీతాల  చెల్లించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు మూడు దశాబ్దాల కాలంగా ధనవంతులుగా ఉన్న హెచ్‌ఏఎల్‌ సంస్థ మొదటిసారిగా నగుదు కోసం అప్పు (ఓవర్‌ డ్రాఫ్ట్‌ ద్వారా) చేసామని హెచ్‌ఏఎల్‌ ఛైర్మన్‌ ఆర్‌ మాధవన్‌  వ్యాఖ్యాలని ఉటంకిస్తూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదించింది. పుష్కలమైన ఆర్థిక నిల్వలతో ఉన్న సంస్థ తాజాగా లోటు బడ్జెట్‌లోకి జారుకుందని మాధవన్‌ పేర్కొన్నారు. మార్చినాటికి  ఈ నగదు ప్రతికూలత  భరించలేనంత  స్థాయిలో రూ. 6వేల కోట్లకు చేరుకోనుందన్నారు. 

ప్రధానంగా హెచ్‌ఏఎల్‌కు అతిపెద్ద  కస్టమర్‌గా ఉన్న భారత  వైమానిక దళం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయిన  కారణంగా ఆర్థిక ఒత్తిడికి  దారితీసినట్టు  ఛైర్మన్‌ తెలిపారు. 2017 సెప్టెంబర్‌ నాటికి రూ. 14,500కోట్లుగా బకాయిల్లో కేవల రూ. 2వేల కోట్లను మాత్రమే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చెల్లించింది. 2017-18 సంవత్సరానికి రక్షణ మంత్రిత్వశాఖ 13,500 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. 2017-18 నుంచి పెండింగ్‌లో  ఉన్న  బకాయితో కలిపి సవరించిన బడ్జెట్ 33, 715 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు డిసెంబరు 31 నాటికి 15,700 కోట్లు తాకిన బకాయిలు మార్చి 31 నాటికి 20,000 కోట్ల రూపాయలకు చేరవచ్చన్నారు. రూ.14,500 కోట్లు ఐఏఎఫ్ చెల్లించాల్సి ఉండగా, మిగిలిన  బకాయిలు భారతీయ సైన్యం, నావికాదళం, కోస్ట్‌ గార్డ్స్‌ నుంచి రావాల్సి ఉంది. 

ఈ పరిణామం సంస్థపై ఆధారపడిన దాదాపు 2వేల మంది సూక్ష్మ, చిన్నమధ్య తరహా వ్యాపారస్తులను ప్రభావితం చేయనుందని  మాధవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నగదు కొరత అప్పులవైపు నెడుతోంది, లేదంటే బకాయిలు చెల్లించమని  ఎంఎస్‌ఎఈలను బలవంతం చేయాలి. ఇది వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు.  కాగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 29,035. వీరికి చెల్లించే నెలవారీ జీతాల మొత్తం రూ.358 కోట్లు. 
 

>
మరిన్ని వార్తలు