‘ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాం’.. ఉద్యోగులకు స్పాటిఫై భారీ షాక్‌!

4 Dec, 2023 15:37 IST|Sakshi

ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. తన వర్క్‌ ఫోర్స్‌లో మొత్తం 17శాతం మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది

స్పాటిఫై సీఈఓ డానియల్‌ ఏకే తన బ్లాగ్‌ పోస్ట్‌లో ఉద్యోగుల లేఆఫ్స్‌పై స్పందించారు. ‘‘ సంస్థ పనితీరు బాగుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. డబ్బులు సంపాదించాలంటే బిజినెస్‌ జరగాలి. కాబట్టే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. డబ్బుల‍్ని ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి. ఎంత మందితో ఏ పనిని ఎలా చేయాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నట్లు’’ డానియల్‌ బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

ఉద్యోగుల తొలగింపులు తప్పడం లేదు
అంతేకాదు, ఈ నిర్ణయంతో స్పాటిఫై కంపెనీలో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. మా లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాల్ని మార్చేస్తున్నాం. తీసుకునే నిర్ణయం కఠినమైందే. కానీ తప్పడం లేదు. సంస్థలోని మొత్తం 17 శాతం ఉద్యోగుల్ని ఫైర్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 

ఫలితంగా స్పాటిఫైలో అనేక మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సూటీగా చెప్పాలంటే కష్టపడి పనిచేసే తెలివైన, ప్రతిభావంతులైన సిబ్బంది మమ్మల్ని విడిచిపెడతారు అని డేనియల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు.

తొలగించిన ఉద్యోగుల్ని సంరక్షిస్తాం.
అదే సమయంలో విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. వారిని అన్ని విధాల ఆదుకుంటాం. ఉద్యోగి ఎక్స్‌పీరియన్స్‌ ఆధారంగా పబ్లిక్‌ హాలిడేస్‌కి డబ్బులు చెల్లిస్తున్నాం. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వినియోగించుకునే సదుపాయం, ఉద్యోగం పరంగా ఇమిగ్రేషన్‌ సమస్యలు రాకుండా కొత్త జాబ్‌లో జాయిన్‌ అయ్యే వరకు వారిని సంరక్షిస్తామని చెప్పారు. 

జూన్‌లో తొలగింపు 
స్పాటిఫై ఒకే ఏడాదిలో రెండో దఫా ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేసింది. ఈ ఏడాది జూన్‌లో పాడ్‌ కాస్ట్‌ యూనిట్‌లోని 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. పోడ్‌కాస్ట్ విభాగంలోని తొలగింపులు వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని ఆ సమయంలో వెల్లడించింది. తాజాగా మరో మారు సిబ్బందికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకుంది.

>
మరిన్ని వార్తలు