పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం

11 Sep, 2017 16:22 IST|Sakshi
పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం
ఆటో పరిశ్రమకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనా సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధం విధించాలని చైనా వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు దానికి సంబంధించిన పరిశోధనను కూడా ఆ దేశం ప్రారంభించిందని, కానీ ఎప్పడి నుంచి ఈ రద్దు నిర్ణయం అమల్లోకి తీసుకురావాలో ఇంకా నిర్ణయించాల్సి ఉందంటూ ఆ దేశ ఇండస్ట్రి ఉపమంత్రి చెప్పారు.  తమ కారు పరిశ్రమ అభివృద్ధి కోసం తీవ్ర మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి జిన్ గుబిన్‌ జిన్హువాకు చెప్పారు. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయం ఆటోమొబైల్‌ తయారీ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని తెలిసింది. 
 
ప్రపంచంలో కార్లకు అతిపెద్ద మార్కెట్‌గా చైనానే ఉంది. ప్రపంచంలో మూడోవంతు కార్లు ఈ దేశంలోనే తయారవుతాయి. ఎక్కువగా చైనా సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడుతుందని, దీంతో కాలుష్యం, కర్బన్‌ ఉద్గారాల విడుదల ఎక్కువగా జరుగుతుందని తెలిసింది. ఈ కారణంతో చైనా సంప్రదాయ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా ఇప్పటికే ఈ ప్లాన్‌ను ఆటోమొబైల్‌ తయారీదారులకు చెప్పింది. 2020 కల్లా ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ పెట్రోల్‌-ఎలక్ట్రిక్‌ వాహనాల షేరును 12 శాతం పెంచాలని తయారీదారులను ఆదేశించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటుచేయాలని ఆ దేశ ప్రభుత్వ రంగ విద్యుత్‌ కంపెనీలనూ ఆదేశించింది. గీలి, వోల్వో చైనీస్‌ యజమాన్యం 2025 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్‌ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెనాల్ట్‌-నిస్సాన్‌, ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌ కూడా చైనాలో ఎలక్ట్రిక్‌ కార్ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయి. 
మరిన్ని వార్తలు