రానున్న ఏడాది ఆర్థికంగా పురోగతి ఉండదు!

3 Aug, 2018 01:26 IST|Sakshi

మెజారిటీ నగర వాసుల అభిప్రాయం 

ఆర్‌బీఐ వినియోగదారుల  విశ్వాస సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే... మరోవైపు రానున్న ఏడాది కాలంలో తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భావించడం లేదంటూ నగరాల్లో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. జూన్‌ నెలకు సంబంధించి ఆర్‌బీఐ నిర్వహించిన వినియోగదారుల విశ్వాస సూచీలో ఈ విషయాలు తెలిశాయి. తమ ఆదాయం, ఉపాధి అవకాశాలు, సాధారణ ఆర్థిక పరిస్థితులు తదుపరి 12 నెలల కాలంలో పురోగతి చెందుతాయని అనుకోవడం లేదంటూ సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా చెప్పడం గమనార్హం. కేవలం 48.2 శాతం మందే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. నాలు గు నెలల కాలంలో ఇంత తక్కువ ఆశాభావం వ్యక్తం కావడం ఇదే. కాకపోతే మే నెలతో పోలిస్తే జూన్‌లో మొత్తం మీద వినియోగదారుల విశ్వాసం కాస్తంత ఇనుమడించింది. ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 27.7 శాతం మంది అయితే ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణిస్తాయని అభిప్రాయం తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో సర్వే కోసం అభిప్రాయాలు తీసుకున్నారు. 

►49.8 శాతం మంది రానున్న సంవత్సర కాలంలో ఆదాయం పెరుగుతుందని చెప్పారు.  
►49.1 శాతం మంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.  
►25.3 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ ఆదాయం పెరిగిందన్నారు.  
​​​​​​​►33.5శాతం మంది ఉపాధి అవకాశాలు గత ఏడాదిలో మెరుగుపడ్డాయనగా, 40 శాతం మంది క్షీణించినట్టు చెప్పారు.  
​​​​​​​►34.6 శాతం మంది గత ఏడాదిలో సాధారణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినట్టు తెలుపగా, దారుణంగా మారినట్టు 42 శాతం చెప్పారు. 

>
మరిన్ని వార్తలు