ఫేస్‌బుక్‌ యూజర్ల నెత్తిన మరో పిడుగు

15 Dec, 2018 16:22 IST|Sakshi

యూజర్లపై  ఎటాక్‌ చేసిన బగ్‌

68 లక్షల  యూజర్ల ఫొటోలు చోరీ

శాన్‌ఫ్రాన్సిస్కో:  సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ యూజర్లకు మరో షాకింగ్‌ న్యూస్‌. ఇటీవలి డేటా లీక్‌ ఉదంతాలను మర్చిపోకముందే మరో డేటా బ్రీచ్‌ పిడుగు ఖాతాదారుల నెత్తిన పడింది. మూడవసారి తమ ఖాతాదారుల డేటా లీక్‌ అయ్యిందంటూ స్వయంగా ఫేస్‌బుక్ నిన్న(డిసెంబరు 14, శుక్రవారం) ఒక ప్రకటన జారీ చేసింది. ఏకంగా 68 లక్షల  ఫేస్‌బుక్‌ యూజర్ల  డేటా, ముఖ్యంగా ఫోటోలు ప్రభావితమైనట్టు వెల్లడించింది.

ఫేస్‌బుక్‌ యాప్‌లోని ఓ బగ్‌ ద్వారా ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపింది. సెప్టెంబరు 12వ తేదీనుంచి  సెప్టెంబరు 25వ  తేదీల మధ్య 12 రోజులపాటు ఇది జరిగి వుంటుందని అంచనా వేసింది. 876 మంది డెవలపర్లు రూపొందించిన1500 థర్డ్‌పార్టీ యాప్స్‌లో బగ్స్‌ ఉన్నట్టు గుర్తించామంది. యూజర్ల ప్రమేయం లేకుండానే వారి ఫోన్లలోని వ్యక్తిగత ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిందని వెల్లడించింది. 6.8 మిలియన్ల యూజర్లు ఈ బగ్‌ ప్రభావానికి గురైనట్టు గుర్తించామని పేర్కొంది.  అంతేకాదు దీనికి తమను క్షమించాలని  కోరింది. 

అయితే  ఈసమస్యను పరిష్కరించామని, ఈ పరిణామానికి క్షంతవ్యులమంటూ  ఫేస్‌బుక్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ టోమర్‌ బార్‌  ప్రకటించారు. వినియోగదారులు థర్డ్‌పార్టీ యాప్స్‌ యాక్సెస్‌ సందర్బంగా ఫేస్‌బుక్‌ వివరాలతో లాగిన్ అవుతుండటం దీనికి కారణం కావచ్చని తెలిపింది. థర్డ్‌పార్టీ యాప్స్‌ను వినియోగదారులు ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు.. ఫేస్‌బుక్‌ యాక్సెస్‌, మీడియా  అనుమతి ఇవ్వడం వల్ల ఒక బగ్‌ దాడి చేసిందని తెలిపింది. అయితే వాటిని గుర్తించి, తొలగించే ప్రక్రియ చేపట్టామనీ, ఈ బగ్‌ బారిన పడిన  ఖాతాదారులకు సమాచారం అందిస్తున్నామని  చెప్పారు.

మరిన్ని వార్తలు