రూ.2 వేల దొంగనోట్లు.. ఎప్పుడొచ్చాయంటే?!

7 Dec, 2017 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి, నల్లధనం, దొంగనోట్లపై ఉక్కుపాదం అంటూ ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు గురించి రోజుకో సమాచారం బయటకు వస్తోంది. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే విషయాన్ని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకటించింది. గత ఏడాది నవంబర్‌ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు ప్రకటన జరిగిన రోజులు గడవకముందే భారీగా కొత్త రెండువేల రూపాయల దొంగనోట్లను అధికారులు పట్టుకున్నారు. నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు జరిగితే.. నవంబర్‌30న నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)  అధికారులు 2,272 దొంగనోట్లను పట్టుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన రెండువేల రూపాయల నోట్లే కావడం గమనార్హం.

ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన కరెన్సీని సైతం దొంగనోట్ల ముఠా రోజుల్లోనే వాటిని ముద్రించింది. ముద్రించిన కొత్త కరెన్సీని దేశవ్యాప్తంగా సరఫరా చేసే ప్రయత్నంలో ఉండగా.. ఎన్‌సీఆర్‌బీ అధికారులు వాటిని పట్టుకున్నారు. పెద్ద నోట్లు రద్దు జరిగిన నవంబర్‌8 నుంచి డిసెంబర్‌31 మధ్యలో అత్యధికంగా గుజరాత్‌లో 1300, పంజాబ్‌లో 548, కర్నాటక 254, తెలంగాణ 114, మహారాష్ట్ర 27, మధ్యప్రదేశ్‌ 8, రాజస్తాన్‌ 6, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 3 నోట్ల చొప్పున అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. రెండువేల రూపాయల దొంగనోట్లతో సహా, రూ.1000, రూ. 500, రూ. 100 విలువగల 2 లక్షల, 82 వేల 839 దొంగనోట్లను అధికారులు పట్టుకోవడం విశేషం. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దొంగనోట్లలో 82,494 నోట్లు రూ. 1000వేకావడం విశేషం. రూ. 500 దొంగనోట్లు లక్ష, 32 వేల 227ను అధికారులు పట్టుకున్నారు.  2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వ అధికారులు పట్టుకున్న దొంగనోట్ల విలువ.. రూ. 10 1,222,821. దేశంలో అత్యంత తక్కువగా కేవలం 21 దొంగనోట్లు గోవాలో పట్టుపడ్డాయి.

మరిన్ని వార్తలు