న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఆరు ఫార్మా ప్రతిపాదనలకు ప్రభుత్వం సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి రెండున్నాయి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్ఐపీబీ) రూ.855 కోట్ల విలువైన ఆరు ఫార్మా ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సెలన్ ల్యాబొరేటరీస్(రూ.12.55 కోట్లు), హైదరాబాద్కు చెందిన గ్లోబియన్ ఇండియా (రూ.1.17 కోట్ల) ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అర్వింద్ మాయారామ్ అధ్యక్షతన గల ఎఫ్ఐపీబీ ఈ నిర్ణయం తీసుకుంది. సింగపూర్కు చెందిన ఫ్రెసెనియస్ కాబి భారత అనుబంధ సంస్థ, ఫ్రెసినియస్ కాబి ఆంకాలజీలో వాటా కొనుగోలు కోసం ప్రతిపాదించిన రూ. 349 కోట్ల ప్రతిపాదన వీటిల్లో ముఖ్యమైనది. రూ. 150 కోట్ల లోటస్ సర్జికల్ స్పెషాలిటీస్ ప్రతిపాదన, రూ. 200 కోట్ల కాలిక్స్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, రూ. 142 కోట్ల స్మిత్ అండ్ నెఫ్యూ పీటీఈ లిమిటెడ్ ఎఫ్డీఐ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.