ట్రేడ్‌ వార్‌: వెండి, పసిడి పతనం

5 Apr, 2018 15:35 IST|Sakshi

సాక్షి, ముంబై:  చైనా- అమెరికా ట్రేడ్‌వార్‌ భయాలు విలువైన మెటల్‌ పసిడిని కూడా తాకాయి.  ఇటీవలి హై నుంచి  బంగారం ధరలు గురువారం పడిపోయాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా ఇదే ధోరణి నెలకొంది.  బులియన్‌ మార్కెట్లో  దేశ రాజధానిలో 99.9 శాతం,  99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రా. పసిడి ధర 10 గ్రా. 60 రూపాయలు తగ్గి,  రూ.31,550, రూ.31,400గా ఉన్నాయి.  అయితే సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర 24,800 రూపాయల వద్ద ఉంది. వెండి ధర కిలో ఏకంగా 425  రూపాయలు పతనమై 39వేల రూపాయల కిందికి  చేరింది. కిలో బంగారం ధర రూ. 38,975వద్ద ఉంది. ఫ్యూచర్స్‌  మార్కెట్లో  10 గ్రా. బంగారం 222 రూపాయలు క్షీణించి 30,500 వద్ద ఉంది.  

స్పాట్ బంగారం 0.6 శాతం నష్టపోయి 1,324.96 డాలర్లకు చేరుకుంది. 1,348 డాలర‍్ల వద్ద బుధవారం ఒక వారాన్ని గరిష్టాన్ని నమోదు చేసింది.  అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్‌లో  ఔన్స్ 0.9 శాతం పడిపోయి 1,328.50 డాలర్లకు చేరుకుంది.    వెండి ధరలు కూడా 0.2 శాతం క్షీణించి ఔన్స్‌ ధర16.24 డాలర్లుగా ఉంది. 

మరోవైపు అమెరికా-చైనా దేశాల మధ్య ఏర్పడ్డ వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు వీలుగా చర్చలు చేపట్టనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో తాజాగా పేర్కొనడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదాలకు చెక్‌ పడనున్న సంకేతాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లుకూడా  పాజిటివ్‌గా స్పందించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే పుంజుకున్న సెన్సెక్స్‌, ఆర్‌బీఐ పాలసీ రివ్యూలో యథాతథ రేట్లను అమలుచేయడంతో  578 పాయింట్ల లాభంతో ముగిసింది. 

మరిన్ని వార్తలు