ప్రభుత్వ వాటాల విక్రయంతో భారీ ఆదాయం!

30 Oct, 2017 03:37 IST|Sakshi

రూ.58,000 కోట్ల కంటే ఎక్కువ వస్తుందన్న అసోచామ్‌

న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంకులకు భారీగా మూలధన సాయాన్ని ప్రకటించిన కేంద్రం... ఆ ప్రణాళికలో భాగంగా బ్యాంకుల్లో తనకున్న వాటాలను 52% వరకూ తగ్గించుకుంటే, రూ.58,000 కోట్ల కంటే అధిక ఆదాయమే సమకూరనుందని అసోచామ్‌  నివేదికలో తెలిపింది. ‘‘ప్రభుత్వం మూలధన సాయాన్ని ప్రకటించిన తర్వాత పీఎస్‌యూ బ్యాంకులకు మార్కెట్‌ అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. వాటి విలువ ఇప్పటికే పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయంతో రూ.58,000 కోట్ల కంటే ఎక్కువే రానున్నాయి’’ అని అసోచామ్‌ తెలిపింది. పీఎస్‌యూ బ్యాంకులకు మార్కెట్లో అధిక వ్యాల్యూషన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన బాండ్ల సైజును రూ.1,35,000 కోట్ల లోపునకు తగ్గించుకోగలదని, దాంతో బడ్జెట్‌పై వడ్డీ రేట్ల భారం తగ్గడంతోపాటు, ఆర్థికవ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని వివరించింది. వీటితోపాటు రుణ వితరణ పుంజుకుంటే అధిక ఆర్థిక వృద్ధి రూపేణా మరిన్ని ప్రయోజనాలు సమకూరతాయని అసోచామ్‌ తన నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు