15 రోజుల్లోనే ట్యాక్స్‌ రీఫండ్‌?

21 Aug, 2018 20:27 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు(ఐటీఆర్‌) దాఖలు చేసి, రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఐటీఆర్‌ దరఖాస్తులను వేగంగా పరిశీలించి త్వరగా తిరిగి డబ్బు ఇచ్చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ), ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది.

మీడియా రిపోర్టుల ప్రకారం ఇప్పటికే కొంతమంది పన్ను చెల్లింపుదారులకు, రిటర్నులు దాఖలు చేసి, ఈ-వైరిఫై చేపట్టిన అనంతరం 10 నుంచి 15 రోజుల్లో ట్యాక్స్‌ రీఫండ్స్‌ వచ్చేశాయని తెలిసింది. ఒకవేళ అంతా బాగుంటే.. పన్ను చెల్లింపుదారులందరికీ.. ఆదాయపన్ను రిటర్న్‌ల రీఫండ్స్‌ కేవలం 15 రోజుల్లోనే తిరిగి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. 

ఆదాయపన్ను రిటర్నుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఇస్తే, దరఖాస్తు పరిశీలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పదిహేను రోజుల్లో ట్యాక్స్‌ రీఫండ్ ఇచ్చే విధానం త్వరలో రావొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రిటర్నుల ఈ-వెరిఫికేషన్‌ పూర్తికాకుంటే పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌ ఆలస్యం అవుతుందని తెలిపాయి. అయితే ప్రస్తుతం ఐటీ రిటర్నుల రీఫండ్‌కు నిర్దిష్ట గడువంటూ ఏమీలేదు. దాంతో ట్యాక్స్‌ రీఫండ్‌కు రెండు వారాల నుంచి రెండు నెలల వరకు సమయం పడుతుంది. ఇది కూడా పన్ను రిటర్నుల దాఖలు బట్టి ఉంటుంది. 

15 రోజుల్లో పన్ను రీఫండ్స్‌ చేయడం సాధ్యమనే తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్‌ రీఫండ్‌ను ట్యాక్స్‌ డిపార్‌మెంటే ఆమోదించాల్సి ఉంటుంది. ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఆమోదం తర్వాత చివరికి పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతాలోకి చెల్లించిన మొత్తంతో పాటు వడ్డీ కూడా వాపసు అవుతుంది. రీఫరెన్స్‌ నెంబర్‌తో పన్ను చెల్లింపుదారులు, తమ ట్యాక్స్‌ రీఫండ్‌ను మానిటర్‌ చేసుకోవచ్చు. 
 

మరిన్ని వార్తలు