బ్రిటన్‌ వీధుల్లో దర్జాగా నీరవ్‌

9 Mar, 2019 12:58 IST|Sakshi

లండన్‌ : భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాడు  నీరవ్ మోదీ.. ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నీరవ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, అతడు దొరకగానే భారత్‌కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే నీరవ్‌ మాత్రం దర్జాగా బ్రిటన్‌ వీధుల్లో తిరుగుతూ.. రాజభోగాలు అనుభవిస్తున్నాడు. లండన్‌లోని సెంట్రల్‌ పాయింట్‌ టవర్‌ బ్లాక్‌లో నీరవ్‌ ఉన్నట్లు టెలిగ్రాఫ్‌ ధృవీకరించింది. నీరవ్‌ లండన్‌ వీధుల్లో తిరుగుతున్న వీడియోను తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో నీరవ్‌ ఆచూకీ వెలుగులోకి వచ్చింది.

తప్పు చేశానన్న భయం ఏమాత్రం లేదు
ఏ మాత్రం భయం లేకుండా రద్దీగా ఉండే లండన్‌లోని వెస్ట్‌ ఎండ్‌లో విహరిస్తున్న నీరవ్‌ను టెలిగ్రాఫ్‌ రిపోర్టర్‌ గుర్తించాడు. అనంతరం అతడితో సంభాషించేందుకు ప్రయత్నించాడు. నీరవ్‌ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, రిపోర్టర్‌ వదలలేదు. భారత్‌లో చేసిన ఆర్థిక నేరం, లండన్‌లో ఎక్కడ నివసిస్తున్నారు, ఏం చేస్తున్నారంటూ నీరవ్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే వీటన్నింటికి నో కామెంట్‌ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు నీరవ్‌. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆ రిపోర్టర్‌ వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ ఆర్థిక నేరగాడి ఆచూకి వెలుగు చూసింది.
ఇక తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మీసాలు, గడ్డాలు పెంచాడు. అంతేకాకుండా ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో నీరవ్‌ ధరించిన కోటు ధర సుమారు ఏడు లక్షలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం నీరవ్‌ మోదీ సెంట్రల్‌ పాయింట్‌ టవర్‌ బ్లాక్‌లో లగ్జరీ అపార్ట్‌ మెంట్‌లో నివాసం ఉంటున్నాడని.. ఆ అపార్ట్‌మెంట్‌ అద్దె నెలకు రూ.16 లక్షలని సమాచారం. లండన్‌లోనూ తిరిగి బిజినెస్‌ ప్రారంభించాడని.. వెస్ట్‌ ఎండ్‌లో భారీ ఎత్తున వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరోవైపు నీరవ్‌కు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసినా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో సుమారు రూ.13 వేల కోట్లకు పైగా అప్పు తీసుకున్న నీరవ్‌.. అనంతరం ఆ బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. 

చదవండి:
పీఎన్‌బీ స్కాం : నీరవ్‌కు మరో ఎదురు దెబ్బ
డైనమైట్లతో నీరవ్‌ మోడీ బంగ్లా పేల్చివేత

మరిన్ని వార్తలు