పైసా కూడా కట్టకుండానే విమానంలో రిజర్వేషన్

26 Sep, 2014 14:17 IST|Sakshi
పైసా కూడా కట్టకుండానే విమానంలో రిజర్వేషన్

విమానయాన రంగంలో పోటీ సరికొత్త ఆఫర్లకు తెరతీస్తోంది. ఇప్పటివరకు వెయ్యి రూపాయల లోపే స్వదేశీ విమానయానం అందిస్తున్నట్లు పలు సంస్థలు ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా అసలు పైసా కూడా చెల్లించకుండానే తమ విమానాల్లో సీట్లు బుక్ చేసుకోవచ్చంటూ ఇండిగో ఎయిర్లైన్స్ సరికొత్త ఆఫర్ తెచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా ఇండిగో విమానం దేంట్లోనైనా కస్టమర్లు సీటు బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా ఆరు గంటల పాటు బ్లాక్ చేసి ఉంచుకోవచ్చు. అప్పటివరకు టికెట్ ధర కూడా ఏమీ మారదు. ఆరు గంటల్లోగా చెల్లింపు చేస్తే సరేసరి.. లేకపోతే ఆ బుకింగ్ రద్దవుతుంది.

ఇందుకోసం ముందుగా ఇండిగో వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి. తర్వాత కావల్సిన విమానాన్ని ఎంచుకుని, 'పే లేటర్' అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు వినియోగదారులకు ఒక పీఎన్ఆర్ నెంబర్ వస్తుంది. ముందు వెనుకలు అన్నీ చూసుకున్న తర్వాత ఆరు గంటల్లోగా చెల్లింపు చేయాలి. లేనిపక్షంలో రిజర్వేషన్ రద్దవుతుంది. అయితే, 72 గంటల తర్వాత చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఇండిగో తన ట్విట్టర్ పేజీలోను, ఫేస్బుక్ పేజీలోను పోస్ట్ చేసింది.

మరిన్ని వార్తలు