ఎస్సార్‌స్టీల్‌ ఇక ఆర్సెలర్‌ మిట్టల్‌దే! 

12 Feb, 2019 01:05 IST|Sakshi

ఎస్సార్‌ దివాలా కేసుపై నిర్ణయానికి ఎన్‌సీఎల్‌టీకి లైన్‌క్లియర్‌ ∙అడ్డంకులను తొలగించిన సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ దివాలా కేసు పురోగతిలో అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తొలగించింది. దీంతో ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ తరఫున దాఖలైన అత్యధిక బిడ్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అహ్మదాబాద్‌ బెంచ్‌ ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. వివరాల్లోకి వెళితే... ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ దాఖలు చేసిన రూ.42,000 కోట్ల అత్యధిక బిడ్డింగ్‌పై ఈ నెల 11వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోవాలని నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎస్‌సీఎల్‌ఏటీ) ఒక ఉత్తర్వు జారీ చేసింది. అయితే దీనిని 28 మంది ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌  వ్యతిరేకించారు. ఎస్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వుకు స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీఎల్‌టీ తమ వాదనలు అందరివీ వేర్వేరుగా రోజూవారీ వినేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. అందరూ కలిసి ఒకే రిప్రజెంటేషన్‌ సమర్పించాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించడం సరికాదని స్పష్టంచేశాయి. అయితే ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేస్తూ, వారి ద్వారా ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్లే దివాలా పక్రియను అడ్డుకుంటున్నట్లు పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంది. 270 రోజుల్లో దివాలా ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికే 571 రోజులు గడిచిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది.   

ఎన్‌సీఎల్‌ఏటీపై ఇక దృష్టి... 
కాగా ఆర్సెలర్‌ మిట్టల్‌ బిడ్డింగ్‌పై 11వ తేదీలోపు ఎన్‌సీఎల్‌టీ తుది నిర్ణయం ఇవ్వాలని లేదంటే 12వ తేదీన తానే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఎన్‌సీఎల్‌ఏటీ గతంలో రూలింగ్‌ ఇచ్చింది. ఈ గడువు తీరడంతో ఇప్పుడు ఎన్‌సీఎల్‌ఏటీ చర్యలపై ఆసక్తి నెలకొంది. 

మరిన్ని వార్తలు