ప్రశ్నార్థకంగా సహారా రూ. 25 వేల కోట్లు

16 Nov, 2023 05:00 IST|Sakshi

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతో రాయ్‌ మరణించడంతో సహారా–సెబీ ఖాతాలోని రూ. 25,000 కోట్ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. రెండు గ్రూప్‌ సంస్థలు సమీకరించిన నిధులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు వాపసు చేసేందుకు సహారా గ్రూప్‌ ఈ నిధులను సెబీ ఖాతాల్లో జమ చేసింది.

వివరాల్లోకి వెడితే.. సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఐఆర్‌ఈఎల్‌), సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌హెచ్‌ఐసీఎల్‌) దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన నిధులను వాపసు చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2011లో ఆదేశించింది.

2012లో సుప్రీం కోర్టు కూడా సెబీ ఉత్తర్వులను సమర్థ్ధిస్తూ, 15 శాతం వడ్డీతో ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 95 శాతం మందికి రిఫండ్‌ చేసేశామని సహారా గ్రూప్‌ తెలియజేసినా, ఆ వాదనలను తోసిపుచ్చి రూ. 24,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లో జమ చేయాలంటూ ఉత్తర్వులు ఇచి్చంది.

ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ. 25,000 కోట్లు ఉన్నాయి. ఈ 11 ఏళ్లలో సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థల ఇన్వెస్టర్లకు సెబీ రూ. 138 కోట్లు వాపసు చేసింది.  చాలా మటుకు ఇన్వెస్టర్ల వివరాలు సరిగ్గా లేకపోవడం, క్లెయిమ్‌లు రాకపోవడంతో మిగతా నిధులన్నీ సెబీ దగ్గరే ఉన్నాయి. అనారోగ్యంతో సుబ్రతో రాయ్‌ మరణించిన నేపథ్యంలో  పంపిణీ చేయని ఈ సొమ్ము పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు